Monday, November 29, 2010

తల్లీ కొడుకులు పార్టీకి.. పదవులకూ.. గుడ్‌బై * నన్ను పంపించాలనుకున్నారు నేనే వెళుతున్నా ! * ఒంటరిని చేసే కుట్రపన్నారు...

కాంగ్రెస్‌కు వైఎస్ జగన్ రాజీనామా
ఒంటరిని చేసే కుట్రపన్నారు...
jagan-car
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గారికి,
బరువెక్కిన గుండెతో, తీవ్రమైన ఆవేదనతో మీకు ఈ లేఖను రాస్తున్నాను. గడచిన 14 నెలలుగా అనేక అవమానాలను దిగమింగుకుంటున్నాను. నా మీద, నా కుటుంబం మీద చివరకు జనహృదయ నేత దివంగతుడైన నా తండ్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డిగారి మీద కూడా నీచమైన స్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా ఓపిగ్గా సహిస్తూ వస్తున్నాను. చివరకు కాంగ్రెస్‌ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన మహానేత కుటుంబంలోనే చిచ్చు పెట్టే కుటిల నీతిని చూసి అవాక్కయ్యాను. మా చిన్నాన్న వైఎస్‌.వివేకానందరెడ్డికి ఆశలు చూపి పథకం ప్రకారం ఢిల్లీకి రప్పించుకుని మా కుటుంబాన్ని చీల్చే నీచ రాజకీయం చేస్తారా? గులాంనబీ ఆజాద్‌ సూచనలతోనే చిన్నాన్న ఢిల్లీకి వెళ్లాడని, జగన్‌కు కుటుంబంతోనే పగ్గాలు వేయాలని ప్రయత్నిస్తున్నారని పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తీవ్రమైన వ్యధకు గురయ్యాను.

Smt-Vijayalakshmiజరుగుతున్న పరిణామాలన్నీ నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టడానికీ, రాజశేఖరరెడ్డి కీర్తి ప్రతిష్టలను తుడిచివేయడానికి జరుగుతున్నవేనని నాకు అర్థమవుతూనే ఉంది. అసలెందుకు ఇలా జరుగుతోంది. నేను చేసిన నేరమేమిటి? నా మీద, నా కుటుంబం మీద ఎందుకు ఇలా త్తి కట్టారు? నా తండ్రీ కీర్తి ప్రతిష్టల మీద ఎందుకు పరదాలు కప్పుతున్నారు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఏమిటది? నా తండ్రి చనిపోయిన రోజున 150 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి పదవికి నా పేరును ప్రతిపాదించి సంతకాలు చేస్తే మీ అభీష్టం మేరకు నేను దూరంగానే ఉన్నానే.. అది తప్పా? మీ ఆదేశాన్ని శిరసావహించి రోశయ్య పేరును ముఖ్యమంత్రి పదవికి నేనే ప్రతిపాదించాను కదా.. అది తప్పా? మొన్నటికి మొన్న మీరు ముఖ్యమంత్రిని మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డిని పెట్టాలనుకున్నప్పుడు సీఎల్‌పీ సమావేశం సజావుగా సాగేలా సంపూర్ణంగా సహకరించాను కదా. అది కూడా తప్పేనా?

ఇక నేను చేసిన తప్పేమిటి.. ఓదార్పు యాత్రేనా? అది నా వ్యక్తిగతమని నేను ఆచరించి తీరాల్సిన పుత్ర ధర్మమనీ ఇప్పటికే అనేక సార్లు చెప్పాను. నా తండ్రి గారు జనహృదయాలను చూరగొన్న మహానేత కావడం వల్ల ఆయన హఠాన్మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు అనాధలయ్యాయి. ఈ నేపథ్యంలో మా నాన్న చనిపోయిన 20 రోజులకే, దుర్ఘటన జరిగిన పావురాల గుట్ట సాక్షిగా అక్కడ సంస్మరణ సభలో మాట్లాడుతూ ఆ బాధిత కుటుంబాలను వారింటికే వెళ్లి పలకరిస్తానని మాటిచ్చాను. దివంగతులైన నా తండ్రి ఆత్మశాంతి కోసం నేను ఆనాడు మాటిచ్చాను. ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కనుకనే ఇది ఆచరించి తీరాల్సిన సాంప్రదాయం కనుకనే, యాత్రకు మీ అనుమతి కోరాను. గత నవంబర్‌లోనే ప్రారంభం కావాల్సిన యాత్రను మీ సూచన మేరకు మీ మీద గౌరవంతో వాయిదా వేసుకున్నాను.

recogniation'అనంతరం ఓదార్పు యాత్రను ప్రారంభించిన నాటి నుంచి మా మీద దాడి మొదలైంది. కారణం ఆ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడమే. జనం గుండెల్లో రాజశేఖరరెడ్డి సజీవంగా ఉన్నాడని, సజీవంగా ఉంటాడని తేటతెల్లం కావడం కొందరు కాంగ్రెస్‌ పెద్దలకు మింగుడు పడలేదు. ఓదార్పు యాత్రపై తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. పార్టీని రెండు సార్లు ఒంటిచేత్తో విజయపథానికి నడిపించిన జననేత విగ్రహాలు ఊరూరా పెడితే పార్టీకి ఏ విధంగా నష్టమో చెప్పగలరా? లేని ఉద్దేశాలను నాకు ఆపాదించారు.మొదటి నుంచి కూడా రాజశేఖరరెడ్డి గారి ఉన్నతిని ఓర్వలేని కొందరు నేతలు చేస్తున్న కార్యక్రమంగా దీనిని నేను సరిపెట్టుకున్నాను.

కానీ క్రమంగా జరుగుతున్న పరిణామాలతో నాకో విషయం అర్థం కావడం మొదలైంది. జనం గుండెల్లో నుంచి వైఎస్సార్‌ ప్రతిబింబాన్ని తుడిచివేయాలని, ఆయన జ్ఞాపకాలను సైతం ధ్వంసం చేయాలని ఢిల్లీ స్థాయిలోనే ఒక పకడ్బందీ వ్యూహం తయారైనట్లు నాకు అర్థమైంది. దురదృష్టవశాత్తు ఈ వ్యూహకర్తలకు సాక్షాత్తు అధిష్ఠానం ఆశీస్సులే ఉన్నట్లు తేటతెల్లమైంది. మిమ్మల్ని కలవాలని ఓదార్పు యాత్ర ఉద్దేశాలను వివరించాలని దివంగత నేత సతీమణి, నా తల్లి విజయలక్ష్మి గారు మీ అపాయింట్‌మెంట్‌ కోసం లేఖ రాశారు. నెల రోజులకు గానీ మాకు మీ సందర్శనకు అనుమతి లభించలేదు. మీకు అవసరం ఉంటే మా చిన్నాన్నకు అయినా, చిరంజీవికి అయినా ఒక్కరోజులో అపాయింట్‌మెంట్‌ దొరుకుతుంది లేదంటే దివంగత నేత వైఎస్‌ సతీమణి తన భర్తను కోల్పోయిన కొద్ది నెలలకే మీ అపాయింట్‌మెంట్‌ అడిగితే నెలరోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. అయినా మేమేమి బాధపడలేదు.

jagan-standఆ భేటీలో మీకు అన్ని విషయాలు వివరించాం. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. చివరకు ఓదార్పు యాత్రలో ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనకూడదని కట్టడి చేశారు. ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు జరిపారు. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రికి ఫోన్లు చేశారు. ముఖ్యమంత్రి మంత్రులకు ఫోన్లు చేశారు. ఆ యాత్రకు ఎవ్వరూ సహకరించకుండా ప్రయత్నాలు చేశారు. అయినా వైఎస్‌ను అభిమానించే జనసామాన్యం, కిందిస్థాయి కార్యకర్తల అండదండలతో యాత్ర విజయవంతంగా సాగింది. యాత్రలో పాల్గొన్న వారి మీద, నాకు సహకరించిన వారి పైనా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. మద్దతుగా నిలిచిన వారిపై వేటు వేశారు.

ఓదార్పు యాత్రను భగ్నం చేయడానికి ఒక పక్క ప్రయత్నాలు చేస్తూనే నా మీద, నా కుటుంబం మీద విష ప్రచారాన్ని కొనసాగించారు.కాంగ్రెస్‌కు ఆగర్భశత్రువులమని స్వయంగా ప్రకటించుకున్న మీడియాతో స్నేహం చేసి తప్పుడు ఆరోపణాస్త్రాలను మా మీద సంధించారు.దివంగత నేత మీద కూడా దుర్మార్గమైన ఆరోపణలు చేశారు. ఆయన లేరని తెలిసి, ఆరోపణలకు బదులు ఇచ్చుకోలేరని తెలిసి కొందరు పార్టీ నేతలే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. సాక్షాత్తు మిమ్మల్నే కలిసి వచ్చిన కొందరు నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చేశారు.

ఇంత జరుగుతున్నా పార్టీ నాయకత్వం గానీ, రాష్ట్ర మంత్రివర్గం గానీ కనీసం ఖండించనైనా లేదు. నిన్నటిదాకా ఉన్న మంత్రివర్గమంతా వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మంత్రివర్గమే. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ వీరు భాగస్వాములే. అయినా సరే ఈ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నమే వారు చేయలేదు. ఇంకో పక్క వైఎస్సార్‌ జ్ఞాపకాలను తుడిచివేసే ప్రయత్నం కూడా ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ సభల్లోనూ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయన ఫోటో లేకపోవడం ప్రతిసారి వివాదస్పదమవుతోంది.ఆయన ఫోటో లేనందుకు జనం నిలదీస్తున్నారు. అయినా సరే వారి వైఖరిలో మార్పు రాలేదు. అన్నిటికంటే దిగ్భ్రాంతికరమైన విషయం వైఎస్సార్‌ మరణంపై జరిగిన కంటి తుడుపు దర్యాప్తు. నాతో సహా ప్రజల్లో ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయి.

ఆ అనుమానాలకు సీబీఐ, నిపుణుల నివేదికలు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయాయి. జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కనీసం ఏ ఒక్కరినైనా ఈ దర్యాప్తు వేలెత్తి చూపలేకపోయింది. ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోయారు. దాని గురించి మాట్లాడటమే మహాపాపమన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. మహానేత హెలికాప్టర్‌ దుర్ఘటనకు సంబంధించి అనేక సందేహాలను నివృతి చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేకపోయింది. అయినా దాని మీద ఏం మాట్లాడిన ఎలాంటి పెడర్థాలు తీస్తారోనన్న అనుమానంతో క్రమశిక్షణ గల కార్యకర్తగా మౌనంగా భరిస్తూ వచ్చాను. అంతే కాదు ఓ రష్యన్‌ వెబ్‌సైట్‌ వెలువరించిన కథనం ఆధారంగా కొన్ని ఛానళ్లతో పాటు సాక్షి కూడా చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది మహాపరాధమైనట్లు సాక్షి కార్యాలయంపై పోలీసులు దాడి చేసి సోదాలు చేశారు.

నన్ను పార్టీ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రతి చిన్న సంఘటనను అవకాశంగా మల్చుకుంటున్నారు. సాక్షి ఛానల్‌లో వచ్చిన ఒక రాజకీయ విశ్లేషణ కథనాన్ని భూతద్దంలో చూపి సాక్షి కార్యాలయాలపై కొందరు కాంగ్రెస్‌ నేతలు దాడులు చేయించారు. పార్టీకి, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా నేనే కుట్ర చేసినట్లు ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి 125 సంవత్సరాలు నిండిన సందర్భంగా సాక్షి ఛానల్‌ ఒక విశ్లేషాణాత్మక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనంలో కొన్ని ప్రశంసలు, కొన్ని విమర్శలతో పాటు కొన్ని సానుకూల, ప్రతికూలంశాలను చర్చించింది.

ఇలాంటి కథనాలే ఇతర జాతీయ పత్రికల్లో, మేగజైన్లలో వచ్చాయి. అలాగే బీహార్‌ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో రాహుల్‌ గాంధీ ప్రస్తావన అన్ని జాతీయ, ప్రాంతీయ ఛానళ్లతో పాటు సాక్షిలో కూడా వచ్చింది. దీనినీ తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. సాక్షి పత్రిక గానీ, సాక్షి ఛానల్‌ గానీ కాంగ్రెస్‌ పార్టీకి చెందినవి కావని, అవి స్వతంత్య్ర మీడియా సంస్థలుగా నిష్పక్షపాతంగా పని చేస్తాయని, వాటిని ప్రారంభించిన రెండు సందర్భాల్లోనూ సభాముఖంగానే నేను ప్రకటించాను. ఆ సభల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు రాష్ట్ర గవర్నర్‌, వీరప్ప మొయిలీ, ఆనంద్‌ శర్మ వంటి కాంగ్రెస్‌ పెద్దలు పీసీసీ అధ్యక్షుడు సహా అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర నేతలు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు.

అప్పుడూ ఏ ఒక్కరు నా మాటలకు అభ్యంతరం చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్‌ ఛానల్‌లో కాంగ్రెస్‌ వ్యతిరేక వార్త వచ్చిందనే అసత్య ప్రచారంతో పథకం ప్రకారం సాక్షిపై దాడులకు ఉసిగొల్పారు. ఢిలీ నుంచి అందిన ఆదేశాలతో యువజన కాంగ్రెస్‌ నేతలు కొందరు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఈ ఆందోళన ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకి అన్న ముద్ర వేయడం వారి లక్ష్యం. నన్ను పార్టీనుంచి గెంటివేసే కుట్ర జరుగుతుందనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా? చివరకు మా కుటుంబంలోనే చిచ్చు పెట్టే నీచమైన ఎత్తుగడలకు దిగజారారంటే ఏమనుకోవాలి? ఇంకెంత కాలం సహనంతో ఉండాలి?

వీటికి తోడు ప్రతి రోజు నాపైన గాలి వార్తల ప్రచారం, నా మీద వేటుకు రంగం సిద్దమైందంటూ మీడియాకు కథనాలు అందిస్తున్నారు. వేటా? లేటా? అని పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందంటే రోడ్డు మీద వెళ్ళే ఏ చిన్న పిల్లాడిని అడిగినా నేడో రేపో జగన్‌మోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరిస్తారు. అని ఠకీమని సమాధానం చెపుతారు. అదును కోసం చూస్తున్నారని, జగన్‌పై ఇక వేటు వేస్తారని సామాన్య జనం కూడా అనుకునే పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని విషప్రచారాల నడుమ, ఇన్ని కుట్రలు, కుహకాల మధ్య మహానేత ప్రతిష్టకు మసిపూసే కుయుక్తులను సహిస్తూ ఇంకా ఈ పార్టీలో కొనసాగడంలో అర్థం లేదని భావిస్తున్నా. నాన్నను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న కోట్లాది మంది జనానికి అండదండగా నిలవడం ఈ పార్టీలో సాధ్యం కాదని అర్థమైంది. ఏ పార్టీ కోసమైతే నా తండ్రి తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పార్టీ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఆయన కుటుంబానికి కల్పించడం, అందుకు అధిష్ఠానం ఆశీస్సులు ఉండటం అత్యంత శోచనీయం. నాకు మరో మార్గం లేదు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేనూ, నా తల్లి విజయలక్ష్మి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం. పార్టీ ద్వారా సంక్రమించిన శాసనసభ సభ్యత్వానికి నా తల్లిగారు, పార్లమెంట్‌ సభ్యత్వానికి నేనూ రాజీనామా చేస్తున్నాం.ఒంటరిని చేసి పంపించాలనుకున్నారు.ఒంటరిగా నేనే వెడుతున్నాను. ఈ సందర్భంగా మీకో విషయాన్ని స్పష్టం చేయదలిచాను.

నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నానని నా వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కాంగ్రెస్‌ నేతలు ప్రచారాలు చేయించారు. అటువంటి నీచమైన వ్యక్తిత్వం కాదు నాది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా ఒక మాట ఇస్తే దానికి ఎప్పటికీ కట్టుబడి ఉండాలని మా నాన్న నాకు నేర్పించారు. అలాగే రాజకీయాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలో అయినా విశ్వసనీయత పెంపొందించుకోవాలని, ఉన్నత విలువలు పాటించాలని ఆయన నాకు నేర్పారు. ఈ విలువలు దిగజార్చేలా నేనెప్పుడూ వ్యవహరించలేదు. ఇకముందూ వ్యవహరించబోను.మళ్లీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. 150 మంది శాసనసభ్యులు నా ముఖ్యమంత్రిత్వాన్ని బలపర్చిన నాడు మీ అభీష్టాన్ని మన్నించానే తప్ప చంద్రబాబు లాగా వైశ్రాయ్‌ తరహా క్యాంపులు నడిపి గద్దెనెక్కి కూర్చోలేదు. విలువలకు కట్టుబడిన వాడిని కనుకనే అలా చేయలేదు.

మీరు రోశయ్య గారిని ముఖ్యమంత్రిని చేయాలని తలవగానే సీఎల్‌పీలో ఆయన పేరును నేనే ప్రతిపాదించాను. ఉన్నత విలువల కోసమే ఆ పని చేశాను.ముఖ్యమంత్రిని మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేయడానికి జరిగిన సీఎల్‌పీ సమావేశం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేందుకు సహకరించిందీ ఉన్నత ప్రజాస్వామ్య విలువల కోసమే. నేను స్థాపించిన సాక్షి మీడియా సంస్థ కూడా స్వతంత్రంగా నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకున్నది కూడా ఆ విలువల కోసమే. అలా వ్యవహరించబట్టే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌ ప్రజాదరణ పొందాయి.

విశ్వసనీయతను ఊపిరిగా భావించినందువల్లే స్థాపించిన రెండేళ్ళలోనే 14 లక్షల పైచిలుకు సర్క్యులేషన్‌ సాధించి సాక్షి దినపత్రిక రికార్డును సృష్టించింది, నేను పాటించిన ఉన్నత విలువలకు అదే సాక్షి. అందుకే చెపుతున్నాను... నేను గతంలో లాగే ఇక ముందు కూడా విలువలను పాటిస్తాను.. గౌరవిస్తాను. నేను ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని పడగొడతానని మీరు భయపడుతున్న నేపథ్యంలో ఆ విలువల స్ఫూర్తితోనే మీకు హామీ ఇస్తున్నాను.. నా తండ్రిని గుండెల్లో పెట్టుకుని నన్ను అభిమానిస్తున్న పార్టీ శాసనసభ్యులందరికీ ఇప్పుడే ఈ సందర్భంలోనే విజ్ఞప్తి చేస్తున్నా.. మీరెవ్వరూ నా కోసం రాజీనామాలు చేయవద్దని.. మీరెక్కడ ఉన్నా మీ ప్రేమాభిమానాలు నాపై ఉంటే చాలని..ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం, ఎలా బతికామన్నదే ముఖ్యమని నా త్రండి తరచూ చెబుతుండేవారు. ఆయన నాకు నేర్పిన సచ్ఛీలత, విశ్వసనీయత, ఉన్నత విలువలు నాకు మార్గదర్శకాలు, అవే నన్ను నడిపిస్తాయి.

యుద్ధ శంఖారావం !
కడప ఎంపీ జగన్‌ యుద్ధం ప్రకటించారు. ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి పైనే సమర శంఖారావం పూరించారు. ఆమె నాయకత్వాన్ని ప్రశ్నించారు. అయిదు పేజీల లేఖతో ఆమె వ్యవహార శైలిని అడుగడుగునా తప్పుబట్టారు. అది సోనియా గాంథీ మీద రాజకీయ దాడి. తనకు జరిగిన అన్యాయానికి ఆమెను అడుగడుగునా నిలదీశారు. సోనియానుద్దేశించి రాసిన లేఖే అయినా, ప్రజలను, వారి మనోగతాన్ని దృష్టిలో పెట్టుకుని పదజాలాన్ని వాడారు. విశ్వసనీయత గురించి ఆయన పదే పదే ప్రస్తావించడం ద్వారా తాను ప్రజల మనిషిగా ఉంటానని, వారికే విశ్వసనీయుడినని చెప్పక చెప్పారు.

ఆక్రోశం, ఆవేదన, వ్యధ కలగలిపి తయారు చేసిన ఆ సుదీర్ఘ లేఖ రాష్ట్రంలో రాజకీయ సంద్రాన్ని అతలాకుతలం చేసింది. అదే సమయంలో ఢిల్లీలోనూ ప్రకంపనలు సృష్టించింది. తన బాబాయ్‌ వివేకానంద రెడ్డిని సోనియా గాంధీ పిలిపించడం ద్వారా తమ కుటుంబంలో చీలికలు తెచ్చే కుటిల నీతికి పాల్పడ్డారని, అదే తనను బాధించిందని చెప్పడం ద్వారా తాను పార్టీని వీడి పోవడానికి దారి తీసిన అనేక కారణాల్లో అదే ప్రధాన కారణమని అన్యాపదేశంగా చెప్పారు. కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు తనను చూసి భయపడుతున్నారని, తనకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తన మీద కక్ష తీర్చుకుంటున్నారని స్వయంగా అందులో ధ్వజమెత్తారు.

తన తండ్రి పేరు ప్రతిష్టలను తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతున్నదన్న ఆవేదనతో పాటు జన సామాన్యం తన వెంటే ఉందన్న ధీమా ఏక కాలంలో ఈ లేఖలో కనిపించాయి.నిజానికి ఈ లేఖ సోనియా గాంధీకి ఉద్దేశించిందే అయినా, అది కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సరికొత్త సవాళ్లను తెచ్చి పెట్టింది. ఆయన నియామకం జరిగి పట్టుమని నాలుగైదు రోజులైనా గడవక ముందే..కేబినెట్‌కు సంపూర్ణ రూపం ఇవ్వక మునుపే జగన్‌ తన అమ్ముల పొదిలోని రాజీనామా అస్త్రాన్ని సంధించారు. అది సోనియా మీద కలిగించే ప్రభావం ఒక రకమైనదైతే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ మీద కలిగించే ప్రభావం మరో రకమైనది.

బుధవారం ఆయన జరప తలపెట్టిన కేబినెట్‌ ప్రమాణ స్వీకారం ఆయనకే అగ్ని పరీక్షగా మార నున్నది. మంత్రి పదవుల మీద ధీమాగా ఉన్న ఆశావహులంతా ప్రస్తుతానికి ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి విధేయత ప్రకటిస్తున్నా, రేపు మంత్రి మండలిలో చోటు దొరకలేదని రూఢి అయ్యాక ఎవరి దారెటో కనుక్కుని ముందుగానే కాయకల్ప చికిత్స చేయడం కొత్త ముఖ్యమంత్రి రాజకీయ వ్యూహానికి పరీక్షగా నిలిచింది.పదవులకు అతీతంగా పార్టీ శ్రేణులనందరినీ ఏకతాటి మీద నిలపడం ఆయన ముందున్న ప్రధాన సవాలు. కేబినెట్‌ ప్రమాణ స్వీకారం అయ్యాక ప్రభుత్వ రోజు వారీ నిర్వహణలో తల మునకలు కావాల్సిన సీఎం హఠాత్తుగా ఈ కొత్త రాజకీయ సవాలును ఎదుర్కోవాల్సివచ్చింది.
ఒంటరిని చేసే కుట్రపన్నారు...
ఒంటరిగా వెళ్తున్నా
కుటుంబాన్ని చీల్చే కుటిల నీతిపై మనస్తాపం
అదేబాటలో వైఎస్ సతీమణి విజయమ్మ
కారణాలు వివరిస్తూ సోనియాకు ఐదు పేజీల బహిరంగ లేఖ
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చబోనని స్పష్టీకరణ

కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ రాజీనామా చేయొద్దని యువనేత విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా పెను సంచలనం... పద్నాలుగు నెలల అవమానానికి, దాడికి, బెదిరింపులకు జవాబు. తన పైన, తన కుటుంబం పైన, వైఎస్ ఇమేజ్ పైనా జరుగుతున్న దాడిని, వైఎస్ కలలుగన్న ప్రజా సంక్షేమం పట్ల అలక్ష్యాన్ని ఇన్నాళ్లు సహనంతో భరించిన జగన్ హుందాగా బంధనాలు తెంచుకున్నారు... ‘ఎంత కాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం’ అని తండ్రి చెప్పిన, తాను నమ్మిన విలువలకు కట్టుబడుతూ యువనేత రాజీనామా చేశారు. కాంగ్రెస్ సభ్యత్వాన్ని, పదవులనూ వదిలేస్తూ వైఎస్ సతీమణి విజయమ్మ, తనయుడు జగన్ పార్టీ నుంచి నిష్ర్కమించారు. కాంగ్రెస్‌కు మారుపేరైన.. కాంగ్రెస్‌కు రాష్ర్టంలో పునర్జన్మనిచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, సతీమణి బయటికి వెళ్లే పరిస్థితి రావడాన్ని... దానికి అధిష్ఠానమే స్వయంగా సారథ్యం వహించడాన్ని చూసి రాష్ట్రం ఉలిక్కిపడింది.. ఆవేదన చెందింది.. ఆవేశపడింది. కన్నీరు పెట్టింది. జనం వీధుల్లోకి వచ్చారు. నిరసన గొంతుక వినిపించారు. డీసీసీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాజీనామాలు సమర్పించారు. మేమూ మీ వెంటేనని నినదించారు. యువనేత రాజీనామా వార్తతో జాతీయ, రాష్ట్ర మీడియా హోరెత్తిపోయింది. ఇది కాంగ్రెస్‌కు చావు దెబ్బేనంటూ చానళ్లన్నీ విశ్లేషణలందించాయి. జగన్ నిర్ణయం సరైనదేనన్న జనాభిప్రాయాన్ని ఒపీనియన్ పోల్స్ ద్వారా అందించాయి. వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయాల్లోనూ విశ్వసనీయత, ఉన్నత విలువలు పాటించాలన్న వైఎస్ ఆదర్శాలకు అనుగుణంగా... ఆత్మవిశ్వాసం, హుందాతనం తొణికిసలాడేలా జగన్ తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా మద్దతు లభిస్తోంది. ఇంటర్నెట్‌లోనూ అదే సంచలనం. గూగుల్ టాప్ 10 వార్తల్లో ఇదే తొలి స్థానంలో నిలిచింది. రాష్ర్ట రాజకీయాల్లో రాబోయే పెను మార్పులకు సోమవారం నాటి పరిణామాలు అద్దం పట్టాయి

కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కడప లోక్‌సభ స్థానానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. ఆయన మాతృమూర్తి, వైఎస్ సతీమణి వైఎస్ విజయలక్ష్మి కూడా పార్టీ సభ్యత్వానికి, పులివెందుల శాసనసభ స్థానానికి రాజీనామా సమర్పించారు. తన తండ్రి జీవితాంతం నమ్మి పాటించిన, ఏడాదిన్నరగా తాను అనుసరిస్తూ వచ్చిన విలువలకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు జగన్ ప్రకటించారు. ఇందుకు రాష్టవ్య్రాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఆయనది సరైన నిర్ణయమని, కాంగ్రెస్ తప్పిదమే ఇందుకు కారణమని, ఇది పార్టీకి పెను నష్టమని పలు తెలుగు వార్తా చానళ్ల ఒపీనియన్ పోల్స్‌లో ప్రేక్షకులు భారీ సంఖ్యలో అభిప్రాయపడ్డారు. పార్టీని ఎందుకు వీడాల్సి వస్తున్నదీ వివరిస్తూ అధినేత్రి సోనియాగాంధీకి జగన్ ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. కొందరు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చబోనని ఆమెకు స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా తనకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ రాజీనామాలు చేయొద్దని కూడా విజ్ఞప్తి చేశారు. తద్వారా జగన్ రాజకీయ పరిణతిని చాటుకున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తనను పార్టీ నుంచి గెంటేసేందుకు అధిష్టానం స్థాయిలోనే కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. ఏడాది న్నరగా తనను ఎలా వేధించిందీ సోదాహరణంగా వివరించారు.

అందుకు అనుగుణంగానే గత 14 నెలలుగా తనపై నానారకాలుగా దాడి జరుగుతోందని, అవమానాలపాలు చేస్తున్నారని అన్నారు. ఈ విష ప్రచారాలన్నింటికీ అధిష్టానం ఆశీస్సులు కూడా ఉండటం కలచివేసిందని చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేకిగా ముద్ర వేసి బయటకు పంపాలని చూశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిని చేసి బయటకు పంపాలనుకున్నారని, అందుకే ఒంటరిగా తానే వెళ్తున్నానని ప్రకటించారు. ‘‘పార్టీ కోసం జీవితాంతం పాటుపడ్డ మహా నేతను కూడా తెరమరుగు చేసేందుకు, ఆయన ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నించారు. చివరికి తాజాగా ఆయన కుటుంబంలోనే చిచ్చు పెట్టే నైచ్యానికి కూడా ఒడిగట్టి, నేను పార్టీని వీడక తప్పని పరిస్థితులను కల్పించారు. నాన్నను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న కోట్లాది మంది ప్రజలకు అండదండగా నిలవడం ఈ పార్టీలో సాధ్యం కాదని అర్థమైంది’’ అని స్పష్టం చేశారు. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని, ఎలా బతికామన్నదే ప్రధానమని వైఎస్ పదేపదే చెప్పిన సూత్రాన్ని ప్రస్తావించారు. తండ్రి నేర్పిన విలువలను దిగజార్చేలా ఇంతదాకా వ్యవహరించలేదని, ఇకముందూ వ్యవహరించబోనని స్పష్టం చేశారు. ఆయన నుంచి అబ్బిన సచ్ఛీలత, విశ్వసనీయత, ఉన్నత విలువలే తనను ముందుకు నడిపిస్తాయన్నారు.

జగన్ రాజీనామా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సోమవారం ఉదయం 11.30 ప్రాంతంలో ఆయన లేఖను మీడియాకు విడుదల చేశారు. అప్పటి నుంచి రోజంతా జాతీయ, ప్రాంతీయ మీడియా మొత్తం దీనిపైనే వార్తలు, కథనాలు, విశ్లేషణలతో హోరెత్తించింది. ఎన్‌డీటీవీ, సీఎన్‌ఎన్-ఐబీఎన్ లైవ్, టైమ్స్ నౌ, హెడ్‌లైన్స్ టుడే, జీన్యూస్ వంటి జాతీయ చానళ్లతో పాటు వాటి వెబ్‌సైట్లలోనూ జగన్ వార్తే ప్రముఖంగా కన్పించింది. వాటికి అనుబంధంగా అనేక న్యూస్ వీడియో క్లిప్పింగ్‌లను ఆ వెబ్‌సైట్స్ అందుబాటులో ఉంచాయి. ఇంటర్నెట్‌లో కూడా జగన్ రాజీనామా వార్త హవాయే నడిచింది. గూగుల్ సెర్చ్‌లో సోమవారం భారత నెటిజన్లు అత్యధికంగా వెదికిన పదంగా (కీ వర్డ్) ఇది నిలిచింది. గూగుల్ టాప్ 10 వార్తల్లో రాజీనామా సంబంధిత అంశాలే టాప్ ఫైవ్‌గా నిలిచాయి! మరో సెర్చ్ ఇంజన్ యాహూ టాప్ స్టోరీల్లోనూ ఇదే మొదటి వార్తగా నిలిచింది.

రాజీనామా గురించి తెలియగానే రాష్టవ్య్రాప్తంగా పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చారు. పలు చోట్ల జగన్‌కు మద్దతుగా, కాంగ్రెస్ అధిష్టానం వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలకు దిగారు. అనంతపురం, కడప వంటి చోట్ల అభిమానులు రెచ్చిపోయారు. కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులకు దిగారు. కాంగ్రెస్ నేతలతో పాటు కొన్నిచోట్ల సోనియాగాంధీ దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు. సోనియా, కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను దహనం చేస్తున్నారన్న వార్తలు తెలియడంతో జగన్ వాటిని ఖండించారు. అటువంటి చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాల్సిందిగా సూచించారు.

రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కూడా జగన్ రాజీనామా తీవ్ర కలకలం సృష్టించింది. దీని పర్యవసానాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించుకోవడం కన్పించింది. జగన్ వద్దన్నా, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వంటి పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాజీనామాల బాట పట్టారు. రాష్టవ్య్రాప్తంగా పీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ నేతలు, డీసీసీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు... ఇలా అన్ని స్థాయిల నేతలూ భారీ సంఖ్యలో రాజీనామాలు చేస్తున్నారు!

జగన్ ఈగోను దెబ్బ తీశారా?

కాంగ్రెసు పార్టీ అధిష్టానం కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లే కనిపిస్తోంది. వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖాయమని ఎప్పుడో నిర్ధారణకు వచ్చిన అధిష్టానం వ్యూహాత్మకంగా ఆపరేషన్ జరిపినట్లు గత వారం రోజుల పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఎప్పటికప్పుడు వైయస్ జగన్ ఈగోను దెబ్బ తీసేందుకు కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుంటూనే ఉంది. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా వైయస్ జగన్ ను వ్యూహాత్మకంగా దెబ్బ తీసేందుకు పూనుకుంది. తన తండ్రి వైయస్సార్ ప్రభుత్వంలో శాసనసభా స్ఫీకర్ గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిని తనకు వ్యతిరేకంగా రంగంలోకి దింపుతున్నట్లు వైయస్ జగన్ కు అర్థమైంది. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించగానే హుటాహుటిన వైయస్ జగన్ బెంగళూర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. కానీ సిఎల్పీ సమావేశం ప్రణబ్ అనుభవంతో వ్యూహాత్మకంగా చడీ చప్పుడు లేకుండా ముగిసింది. అది వైయస్ జగన్ కు తీవ్రమైన దెబ్బనే.

ముఖ్యమంత్రిగా ఎంపికైనా కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించకపోవడం కూడా వైయస్ జగన్ సూపర్ ఈగో వల్లనే అంటున్నారు. కిరణ్ ను అభినందించకుండా తన అంతరంగాన్ని వైయస్ జగన్ బయట పెట్టుకున్నారు. మొదటి నుంచి కూడా వైయస్ జగన్ ఓ ఆధిపత్య భావనతోనే పనిచేస్తూ వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెసులోనే కాదు, రాష్ట్రంలోనే తనను మించిన నాయకుడు లేడనే ఓ విధమైన ఆధిక్య భావన ఆయనకు శాపంగా మారింది. అందుకే, మిగతా నాయకులతో కలవడానికి ఆయన ఇష్టపడడం లేదు. తానే అందరి కన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని, అందరూ తననే గౌరవించాలని, తన మాటే చెల్లుబాటు కావాలని ఆయన కోరుకుంటారు. అదే ఆయనను రాజీనామా దారి పట్టించిందని చెప్పవచ్చు.

మరోవైపు, రోశయ్యను దించేసి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంతో తనకు అవకాశం రాదని ఆయన ఒక నిర్ధారణకు వచ్చినట్లు చెప్పవచ్చు. పిసిసి పదివి కూడా ఆయనకు దక్కే అవకాశాలు లేవని స్పష్టంగా తెలిసిపోయింది. దీంతో వైయస్ జగన్ కు బయటకు వెళ్లిపోయి ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నించడం తప్ప మరో మార్గం కనిపించలేదు. పైగా, బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి పార్టీ అధిష్టానం మాటకు తలొగ్గారు. వైయస్ జగన్ కు ఆయన దూరం కావడానికి నిర్ణయించుకున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసులోనే ఉండాలని అనుకోవడానికి గల పరిస్థితిని గానీ, వైయస్ వివేకా అంతరంగాన్ని గానీ తెలుసుకోవడానికి వైయస్ జగన్ ప్రయత్నించిన పాపాన పోలేదు. వైయస్ వివేకా చర్యను ఆయన తీవ్రంగా నిరసించారు. వైయస్ వివేకానంద రెడ్డి తనను వ్యతిరేకించడం వల్ల కూడా వైయస్ ఈగో దెబ్బ తిన్నది.

మొత్తం మీద, ఓ సూపర్ మ్యాన్ లా తప్ప మరో రకంగా వైయస్ జగన్ ఉండలేరనేది స్పష్టమై పోయింది. అది ప్రాంతీయ పార్టీలో తప్ప కాంగ్రెసు వంటి జాతీయ పార్టీలో సాధ్యమయ్యేది కాదు. ఆయన మనస్తత్వమే ఆయన రాజీనామా చేయడానికి కారణమైంది.

చిరంజీవి పార్టీలో చిచ్చు: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా?


కాంగ్రెసు పార్టీకి, లోకసభ సభ్యత్వానికి వైయస్ జగన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. కాగా, వైయస్ జగన్ రాజీనామా చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చిచ్చు పెట్టింది. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరాలా, వద్దా అనే విషయంపై చిరంజీవి తన పార్టీ శాసనసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వంలో చేరే విషయంపై లేదా ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంపై చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడారు. తమ 18 శాసనసభ్యుల్లో 16 మంది శాసనసభ్యులు కచ్చితంగా ప్రభుత్వానికి మద్దతిస్తారని, తన వెంట నడుస్తారని ఆయన చెప్పినట్లు సమాచారం. శోభా నాగిరెడ్డి, మహేశ్వర్ రెడ్డిలపై ఆయన అమమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. వారితో పాటు మరో ఎమ్మెల్యే కూడా వైయస్ జగన్ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదనే దీమాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అందుబాటులో ఉన్న శాసనసభ్యులతో, ఎమ్మెల్సీలతో సమావేశమై ఆ మేరకు ఆయన హామీ ఇచ్చారు. వైయస్ జగన్ వర్గం ప్రయత్నాలను ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెసుకు శాసనసభలో 156 మంది శాసనసభ్యులున్నారు. ప్రజారాజ్యం పార్టీకి 18 మంది, తెలంగాణ రాష్ట్ర సమితికి 11 మంది, మజ్లీస్ కు ఏడుగురు, సిపిఐకి ఏడుగురు, సిపిఎంకు ఒక్కరు, తెలుగుదేశం పార్టీకి 90 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. శాసనసభలో ప్రభుత్వానికి కనీసం 147 మంది శాసనసభ్యుల బలం అవసరం. వైయస్ జగన్ వర్గం వెళ్లిపోయినా అంతకన్నా ఎక్కువే బలం ఉంటుందని కాంగ్రెసు అధిష్టానం విశ్వాసంతో ఉంది. వైయస్ జగన్ వెంట 15 మందికి మించి శాసనసభ్యులు వెళ్లిపోరనే విశ్వాసంతో ఉంది. ఆ మేరకు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 16 మంది మద్దతిస్తారని భావిస్తున్నారు. ఎక్కువలో ఎక్కువగా జగన్ వెంట 26 మంది శాసనసభ్యులు వెళ్లిపోయినా నష్టం లేదనే భావనతో కాంగ్రెసు నాయకత్వం ఉంది.

తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదని, అందు వల్ల ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ముందుకు రాదని అంటున్నారు. మజ్లీస్ కూడా కాంగ్రెసు వైపే ఉండే అవకాశం ఉంది. తెరాస మద్దతివ్వకపోవచ్చు. తెరాస మద్దతు తీసుకోవాలంటే పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. తెలంగాణ డిమాండ్ ను ఆ పార్టీ మరోసారి ముందుకు తేవచ్చు. అందువల్ల తెరాస మద్దతు తీసుకునే వైపుగా ఆలోచన చేయకపోవచ్చు. ఇతరులను కూడా తమ వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ప్రభుత్వం పడిపోదని వైయస్ జగన్ వర్గానికి చెందిన గోనె ప్రకాశ రావు స్వయంగా చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన వైయస్ జగన్ కు లేదని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు కూడా చెబుతున్నారు. పరిస్థితిని గమనించే జగన్ వర్గం ఆ విధమైన వాదనలను ముందుకు తెచ్చి ఉంటారని భావిస్తున్నారు.

కాగా, వైయస్ జగన్ వెంట ఎవరూ వెళ్లరని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. వైయస్సార్ పై సానుభూతితో అప్పట్లో వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని 150 మంది సంతకాలు చేశారని, తాను కూడా సంతకం చేశానని, ఆ పరిస్థితి ఇప్పుడు లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ మాటల్లో రాజకీయ పరిపక్వత లేదని ఆయన విమర్సించారు. ఎవరో పార్టీ పెడతారని కాంగ్రెసును వీడి వెళ్లేది లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా రాజీనామా చేసే విషయంపై పునరాలోచన చేస్తానని చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్ది వైయస్ జగన్ కు మద్దతు తగ్గుతూ పోతుందని కాంగ్రెసు అంచనా. దానివల్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని అంటున్నారు.