Showing posts with label తెలుగు ఓటరు. Show all posts
Showing posts with label తెలుగు ఓటరు. Show all posts

Friday, May 25, 2012

స్ఫూర్తి కొరవడిన పంచాయతీలు

పంచాయతీలు గ్రామాల్లో రోడ్లు వేసుకుని, పూడికలు తీసుకుని, చెట్లు పెట్టించి, డబ్బులొచ్చే ప్రభుత్వ పథకాలని తెచ్చుకుని, బొక్కసం నింపుకుంటే సరిపోతుందా? ఆడవాళ్లు, పిల్లల పట్ల జరిగే హింస, వివక్షని ఎందుకు ఆపలేక పోతున్నాయి? ఎన్నుకోబడిన ప్రెసిడెంట్, గ్రామంలో నిస్వార్థ సుపరిపాలనకు నాంది పలకకుండా, తన రాజకీయ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయటం గ్రామాల్లో అశాంతికి   దారితీయక ఏమవుతుంది? ఈ దిశగా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించాల్సిందే.

కారణాలు ఏమైనప్పటికీ, ఈ రోజు పల్లెల్లో పల్లె మాట, ఆట, పాట; పల్లె ప్రేమ-అనురాగాలు అన్నీ మసిబారి పోయాయి. మానవీయ విలువలు, నిజాయితీ, కష్టించే తత్వానికీ, నిస్వార్థానికీ నిలువెత్తు సాక్ష్యాలుగా నిలబడ్డ పల్లె యువత నేడు మద్యం మత్తుకు బానిసలవుతున్నట్లే, అవినీతి రాజకీయాలకూ బానిసలవుతున్నారు. స్త్రీలపై హింస, అణచివేత, అసహనం, వివక్ష రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇందుకు పంచాయతీలనూ వాటిని నడిపించే ప్రెసిడెంట్ల పనితీరునూ ఖచ్చితంగా నిలదీయాల్సిందే. కక్ష సాధింపులూ, ఓట్ల రాజకీయాలూ తప్ప అభివృద్ధి లక్ష్యంగా సాగాల్సిన స్థానిక పాలన కోసం చేసిన పంచాయతీ రాజ్ చట్టాల స్ఫూర్తి దెబ్బతిన్నది. రాజకీయ నాయకుల మితిమీరిన జోక్యంతో ముఠా తగాదాలు పెరిగి విభజించి పాలించే తత్వం వేళ్ళూనుకుంటున్నది.

ఏ కొంచెం చదువు, జ్ఞానం వున్న వాళ్ళైనా, పల్లెలు బాగుంటే భారతదేశం బాగుంటుంది అని నమ్మే పెద్ద మనసున్న వాళ్ళైనా-పల్లెల గురించి ఆలోచించటం అంటే పంచాయతీల పనితీరు చర్చించటమే! మనకున్న చట్టాలు చాలా గొప్పగా ఉన్నట్లే పంచాయతీరాజ్ చట్టం కూడా ఎంతో గొప్పగానే తీర్చి దిద్దుకున్నాం. కానీ పంచాయతీలు నడుస్తున్న తీరు గమనిస్తే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలని ఏలుతున్న నీతిబాహ్యమైన, పార్టీ రాజకీయాలకు ఎంత మాత్రం తీసిపోదు. పంచాయతీ ప్రెసిడెంట్‌లు, ఆయా గ్రామాల్లో ఒక చిన్నపాటి గూండా రాజ్యాన్ని తయారు చేస్తున్నట్లే కనిపిస్తుంది! వారి వారి పార్టీలని బతికించుకోడానికి, బలోపేతం చేసుకోడానికి, ఓట్లు పెంచుకోడానికి సీట్లు రాబట్టుకోవడానికే పనిచేస్తున్నారు తప్పించి, పంచాయతీరాజ్ చట్టం స్ఫూర్తి అమలుకావటం లేదు. పంచాయతీలని నడిపిస్తున్న ప్రెసిడెంట్లు, ఆర్థిక సామాజిక దోపిడీలకు పాల్పడుతుంటే పట్టించాల్సిన, పట్టించుకోవాల్సిన ప్రజాస్వామిక వ్యవస్థ స్తబ్దుగా తయారైంది.

గుంటూరు జిల్లాలోని ఒకానొక గ్రామంలో ఆ ఊరి ప్రెసిడెంట్, తన పార్టీకి చెందని గ్రామస్తులని కనీసం పలకరించడు కూడా! అదే గ్రామంలో, వేరే పార్టీకి చెందిన ఒక పేద కుటుంబం, టైలర్ పని చేసుకుంటూ కష్టార్జితంతో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటోంది. అటుగా వెళ్తున్న ఊరి ప్రెసిడెంట్ - ఎప్పుడూ పలకరించిన పాపాన పోనివాడు, ఆగి మరీ అడిగి ఇసుక ఎక్కడినుంచి వస్తుందో కనుక్కుంటాడు. అంతే, తెల్లారితే కప్పు వేయాల్సిన ఇంటిపని కాస్తా అర్ధంతరంగా ఆగిపోతుంది. ఎందుకంటే సమయానికి రావాల్సిన ఇసుక లారీ, ప్రెసిడెంట్ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్‌తో ఎక్కడో సీజ్ చెయ్య బడింది! అదే ఊరిలో ఇద్దరు అత్తా కోడళ్ళు గొడవపడితే, ముసలి అత్తను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసినప్పటికీ కోడలికి మద్దతు పలికితే ఎక్కువ ఓట్లు వస్తాయని లెక్క వేసుకుని, కోడలికే వత్తాసు పలుకుతాడు.

అందుబాటులోకి వచ్చిన రాయితీలను ఉపయోగించుకుని వాగులో మట్టి తవ్వి అమ్ముకోవటం, సొంత చేన్లో లెక్కకు మించి స్కీముల కింద బావుల్ని తవ్వుకుని మట్టి అమ్ముకోవటం, ఊరికోసం వచ్చిన ప్రభుత్వ పథకాలన్నీ పొల్లుపోకుండా సొంత పార్టీ వాళ్ళకి వాడి డబ్బు చేసుకోవటం మొదలైన విషయాల్లో అందె వేసిన చెయ్యి అతనిది.

ఊరికి ప్రెసిడెంట్ కాక ముందు మామూలు రైతు, ప్రెసిడెంట్ అయ్యాక మూడేళ్ళు కూడా తిరక్కుండానే లక్షాధికారి! అవతల పార్టీ సానుభూతిపరుల కుటుంబాలను రాచి రంపాన పడేయటం, పేద కుటుంబాలు అయితే ప్రభుత్వ పథకాలని రానీయకుండా చేయడం -కొంచెం ఆర్థిక స్వావలంబన ఉన్న కుటుంబాలు అయితే వారికి ఆదాయాన్నిచ్చే మార్గాలకి పూర్తి స్థాయి అంతరాయం కల్పించటం, దాని కోసం ఎంతటి దగుల్భాజీ పనైనా చేయటం అతని కర్తవ్యంగా నెరవేరుస్తాడు.

ఆ గ్రామంలో సెంటు భూమి ఖాళీ ఉండదు. పిల్లలు ఆడుకొనే ఆట స్థలం ఉండదు. వీధి దీపాలు విధిగా వెలగటం 40 ఏళ్ళుగా ప్రశ్నార్థకం. కాని ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతాయి- బెల్టుషాపు ఓనర్లకి; ఏడాదికోసారి అంగరంగ వైభవంగా (రాజకీయ పార్టీల) పే రుతో ఊరబంతులు పెట్టి, తాగబోయించి, రికార్డు డ్యాన్సులు పెట్టిస్తారు. ఎవరి కోసమో అనుకుంటున్నారా- అన్నీ త్యజించి, త్యజించమని లోకానికి ఎలుగెత్తిచెప్పిన సాధువు వీరబ్రహ్మం గారికి! ఓట్ల కో సంపడే పాట్లలోభాగమని చెప్పకుండానే ఆయనకో గుడి కట్టిస్తారు...

ఆ ఫలానా రాజకీయ పార్టీ అనుయాయుడుగా మారి జనాన్ని తన అప్రజాస్వామిక పద్ధతుల్లో పంచాయతీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి, భయ భ్రాంతులకి గురిచేయటమే కాక, అమాయక రైతులని, పేద వాళ్ళని, యువతని తన అవినీతిలో నెమ్మది నెమ్మదిగా భాగస్వాములని చేసుకుంటున్నాడు. 'ఎవడు మాత్రం కడిగిన ముత్యం? తింటే తిన్నాడు -ఎంతో కొంత మాకూ ఇస్తున్నాడు కదా, పని కూడా చేస్తున్నాడు కదా!' అనే వాళ్ళ సంఖ్య పెంచుతున్నాడు. ప్రజాస్వా మ్యం అంటే ప్రజల గొంతు, వారి ఆకాంక్ష అనుకునే ప్రజాస్వామ్య వాదులకు 'ప్రజలతోనే బుద్ధి చెప్పించే' ప్రయత్నమే ఇది.

ఈ అవినీతి రాజకీయ నేతలు పల్లెల్లో ప్రెసిడెంట్ల నుంచి పట్నాల్లో బడా రాజకీయ నాయకుల దాకా ప్రజలని కూడా అవినీతిలో భాగస్వాములను చేస్తున్నారు. కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్య తప్పించి, పంచాయితీ ప్రెసిడెంట్ల తీరు దాదాపుగా రాష్ట్రమంతటా ఇదే తీరు అని చెప్పుకోవడంలోఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే జిల్లాల పేర్లు, పార్టీ పేర్లు మారొచ్చు. అంతే తేడా!

రంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామం ప్రెసిడెంట్ తన ఊరిలోని ఒక రేప్ కేసులో నిందితుడిని కాపాడడానికి చెయ్యని సాహసం లేదు. పోలీస్ కేసుని వాపసు తీసుకోమని ఒత్తిడిపెంచడం దగ్గరినుంచి, పోలీసులతోటే బెదిరించడం, ఊరి జనాన్ని ఎగతోయడం, 'మా ఊర్లో ఏమైనా జరిగితే ముందు మా దృష్టికి రావాలిగాని, పోలీసుల దృష్టికి ఎందుకు పోవాలి?' అనే ప్రశ్నలు సంధించడం, ఊరిలో ఎట్లా తిరుగుతారో చూస్తాం అని బెదిరించడం, ఏ పార్టీకి సంబంధం లేని ఒక సేవా సంస్థ మీద 'వారు అవతలి పార్టీకి సానుభూతి పరులు, అందుకే మన మీద కేసు పెట్టారు' అని అబద్ధపు ప్రచారం చేయటం వగైరా అన్నీ చేశాడు.

ఇదంతా ఎందుకు చేశాడు అంటే, పంచాయతీ ప్రెసిడెంట్‌కి, నిందితుని పట్ల ప్రేమా కాదు, బాధితుల పట్ల ద్వేషమూ లేదు - ఓట్ల కోసం అదొక లెక్క! ఆ గ్రామంలో ఆ నిందితునికి సంబంధించిన సామాజిక వర్గానికి ఎక్కువ నోట్లున్నాయి! అతని దృష్టిలో ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురైతే, కాళ్ళ బేరానికొచ్చి, ఊరి పెద్దకి చెప్పుకుని నాలుగు పైసలు పరిహారంగా తీసుకొని వెళ్ళి పోవాలే తప్ప అతని ఓట్ల లెక్కలకి అడ్డు వచ్చి, పోలీసులకి చెప్పి, కోర్టులకెక్కి చట్టం న్యాయం అని వాపోతే ఆ ప్రెసిడెంట్ ఎట్లా ఏడిపించాలో అట్లా ఏడిపిస్తాడు.

నల్లగొండ జిల్లాలో ఒక తండా. 15 ఏళ్ళ గొర్రెల కాపరి. ఆ వయసులోనే ఊరి మగపిల్లల దాష్టీకానికి గురైంది. ఆరు నెలలు నిండేవరకు ఏమీ అర్థం కాలేదు. పొట్ట పెరిగిందని తల్లి డాక్టర్‌కి చూపిస్తే విషయం తెలిసింది. ఇంటికి తీసుకొచ్చి బిడ్డని తల్లీ తండ్రీ ఇద్దరూ కొట్టి చంపారు. విషయం ఊరిలో అందరికీ తెలుసు. ప్రెసిడెంట్‌కి కూడా తెలుసు. సమాచారం పోలీసులకి చేరదు! చట్టం దృష్టికి పోదు... 'గర్భిణిని పూడ్చకూడదు, ఊరికి అరిష్టం అనే మూఢనమ్మకాన్ని మాత్రం ఊరి వాళ్లు తుచ తప్పక అమలుచేయటానికి ఊరి ప్రెసిడెంట్ జనంతో మమేక మవుతాడు.

ఎక్కడినుంచో పోలీసులకు ఉప్పందితే తప్ప, అంత భయంకరమైన హత్య, ఒక ఇంటి గుట్టు, ఊరి పరువు ప్రతిష్ఠగానే మిగిలిపోతుంది. ప్రజల పేదరికాన్నే కాదు, మూఢనమ్మకాలనీ ఓట్ల రాజకీయాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మద్యం మత్తు కాకుంటే మరో మత్తు. జనాన్ని మానవ హక్కులు, నిజాయితీ, మహిళల సమానత్వం, మానవీయ విలువలు, అలాంటి అవగాహనకి ఎంత దూరంగా ఉంచితే అంతకాలం వాళ్ల ని ఓట్ల రాజకీయాలకి అవినీతికి అంత సులువుగా వాడుకోవచ్చు! ఈ సత్యా న్ని మాత్రం పంచాయితీ ప్రెసిడెంట్లు వారి వారి ప్రధాన రాజకీయ పార్టీ నేతల అడుగుజాడల్లో, వారి అండదండలతో ఆసాంతం అవగతం చేసుకుని, నిష్ఠగా అమలుపరుస్తున్నారు.

చాలా చోట్ల కుల సంఘాల నాయకులే ఊరి పెద్దలు. పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా. కుల సంఘాల నాయకులు తమ తమ కులాల సామాజిక న్యాయం కోసం పోరాడటం హర్షించాల్సిందే . అణచివేత, వివక్ష, హింస, దారిద్య్రం, దోపిడీ, హక్కుల హననం ఎక్కడున్నా ఎదిరించాల్సిందే! వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనే, ఆయా పోరాటాల్ని ప్రజాస్వామ్య వాదులు ఎల్లప్పుడూ బలపరుస్తున్నారు. కాని ఈ కుల సంఘాల నాయకత్వాలకు కూడా ఓట్లు, సీట్లు, అధికారం చేజిక్కించుకోడానికే వ్యూహాలు ఎత్తుగడలు ఉంటున్నాయి తప్ప ఆయా కులాల్లో జరుగుతున్న బాల్య వివాహాలు, వరకట్న దాహాలు, హత్యలు, పరువు పేరుతో హత్యలు, మహిళలపై హింస, వివక్ష లాంటి దారుణాలను ఆయా కుల సంఘనాయకులు ఏనాడైనా పట్టించుకుని మాట్లాడారా? మాట్లాడరు.

రాజ్యాధికారం చేజిక్కే వరకు నోళ్ళు విప్పరు అని అనుకోవాలా? వారే గనక వారి కులాల్లో ఆడవాళ్ళ సమస్యల మీద న్యాయ బద్ధంగా మాట్లాడి, వారి వారి కులాల్ని ప్రభావితం చేసి ఉంటే ఇన్ని ఆడ శిశు హత్యలు, బాల్య వివాహాలు, వరకట్న హత్యలు జరిగి ఉండేవా? వారి వారి కుటుంబాల్లో ఆడపిల్లలకి, స్త్రీలకి జరుగుతున్న అన్యాయాల్ని పట్టించుకోకుండా, వారి కులాలకి సామాజిక న్యాయం కోరే నాయకత్వాల నిజాయితీని శంకించకుండా ఎలా ఉండటం? ప్రధానంగా బాల్య వివాహా లు, కుటుంబ హింస, ఆడపిల్లల పట్ల వివక్ష ఎన్ని చట్టాలొచ్చినా ఎం తటి నిజాయితీగల పోలీసు ఆఫీసర్లు ఉన్నా చట్టం ఎంత పటిష్ఠంగా ఉన్నా సమస్యకు కొంత మాత్రమే ఉపశమనం.

కులసంఘాల నాయకులూ పంచాయతీ ప్రెసిడెంట్లు కులపెద్దలూ, బస్తీ నాయకు లూ బాధ్యులు కానంత కాలం స్త్రీలపై హింస పెరుగుతూనే ఉంటుంది. గ్రామాలలో ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు, బయటకురాని మహిళల హత్యలు ఎన్నో ఉన్నాయి. చాలా భాగం కేసులు తొక్కి పెట్టి ఉంచటంలో ఊరి ప్రెసిడెంట్, కుల పెద్దల పాత్ర అధికం. కొన్నిచోట్ల పోలీసులు కూడా, వీరిని ఎదిరించే సాహసం చేయరు. కుల సంఘాల నాయకులే పంచాయతీ ప్రెసిడెంట్లు అయినప్పుడు మరింతగా వారు సమాజాన్ని ప్రభావితం చేయగలిగే అవకాశముంది.

పంచాయతీలు గ్రామాల్లో రోడ్లు వేసుకుని, పూడికలు తీసుకుని, చెట్లు పెట్టించి, డబ్బులొచ్చే ప్రభుత్వ పథకాలని తెచ్చుకుని, బొక్కసం నింపుకుంటే సరిపోతుందా? ఆడవాళ్లు, పిల్లల పట్ల జరిగే హింస, వివక్షని ఎందుకు ఆపలేక పోతుంది? ఎన్నుకోబడిన ప్రెసిడెంట్, గ్రామంలో నిస్వార్థ సుపరిపాలనకు నాంది పలకకుండా, తన రాజకీయ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయటం గ్రామాల్లో అశాంతికి దారితీయక ఏమవుతుంది? ఈ దిశగా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించాల్సిందే. తమ తమ పంచాయతీ ప్రెసిడెంట్‌లను, అనుబంధ కుల సంఘాలను కేవలం గ్రామాల్లో ఓట్లు సమకూర్చే ప్రతినిధులుగా కాకుండా పంచాయతీరాజ్ చట్టాన్ని దాని స్ఫూర్తిని అందుబాటులోకి తెచ్చే నేతలుగా ఎదిగేలా సహాయపడాలి.
- అంకురం సుమిత్ర
వ్యాస రచయిత్రి, సామాజిక కార్యకర్త

Tuesday, December 7, 2010

జగన్‌ సరికొత్త తెలం‘గానం’ సురేఖాస్త్రం !

jaga

డిసెంబర్‌కు ముందే తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఊహించని విధంగా మలుపు తిరుగుతాయని అంచనా వేస్తున్న ప్రధాన పార్టీలు ఆ మేరకు ఇప్పటినుంచే వ్యూహరచన, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా.. రాజకీయ పార్టీ స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణపై దృష్టి సారించారు. ఒకవేళ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడినప్పటికీ, అక్కడ కూడా తాను బలీయ శక్తిగా ఉండేందుకు జగన్‌ ఇప్పటినుంచే ముందుచూ పుతో వ్యవహరిస్తున్నారు. తాను తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని జగన్‌ స్పష్టం చేయనున్నారు.

ఈ విషయంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారిలోనే పయనిం చనున్నారు. ‘జగన్‌ తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. తెలుగు ప్రజలంతా సమానమే. ఆయన రాష్ట్ర విభజనకు అనుకూ లమే. ఒకవేళ రాష్ట్ర ం విడిపోతే మాది జాతీయ పార్టీ అవుతుంది. రాష్ట్ర విభజన అనేది ఇప్పటి సీఎంతో సహా ఎవరి చేతుల్లోనూ లేదు. అది కేంద్రం రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయం. కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించాలన్నది జగన్‌ అభిమతమ’ని ఆయన సన్నిహిత సహచరుడొకరు వ్యాఖ్యా నించారు.

ఇదిలాఉండగా, తెలంగాణలో కూడా తన పార్టీ శక్తివం తంగా తయారుకావాలంటే తెలంగాణ అనుకూల వైఖరి తీసుకో కతప్పదని జగన్‌ శిబిరం నిర్ణయించింది. అందులో భాగంగా.. జనవరి 1 నుంచి బీసీ మహిళా ఎమ్మెల్యే, జగన్‌కు వీర విధేయురాలయిన కొండా సురేఖ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు డిసెంబర్‌ 15 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమ కమిటీలు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి నుంచి టీఆర్‌ఎస్‌కు మించిన ఊపుతో ఉద్యమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అటు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో మౌనంగా ఉండిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు తెలంగానంపై నోరు మెదపని వైఖరి అవలంబిస్తున్నందున.. తాము ఉద్య మాన్ని చేతులోకి తీసుకోవడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లను తెలంగాణ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టేందు కు జగన్‌ శిబిరం వ్యూహరచన చేస్తోంది. జగన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నిష్ర్కమించేందుకు ప్రధాన కారకులయిన తెలంగాణ సీనియర్లకు సరైన సమయంలో సరైన గుణ పాఠం చెప్పాలని జగన్‌ శిబిరం యోచిస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక బీసీ మహిళా ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ నేతృత్వంలో మొదలుపెట్టడం ద్వారా.. వ్యక్తిగతంగా సీనియర్లను, సంస్థాగతంగా కాంగ్రెస్‌ పార్టీని ఏకకాలంలో దెబ్బకొట్టాలన్న వ్యూహం స్పష్టంగా కనిపి స్తోంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖను ముఖ్యమంత్రిగా ముందే ప్రకటించాలన్నది జగన్‌ శిబిరం వ్యూహమని సమాచారం.

తెలంగాణ వస్తే దళితుడిని సీఎంగా చేస్తానని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. బీసీ, దానికితోడు మహిళయిన సురేఖను సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణలో 65 శాతం బీసీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే వ్యూహంతో ముందుకు వెళుతోంది. టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో కలసిపోయిన సంకేతా లు స్పష్టమయినందున.. ఆ పార్టీని కూడా దెబ్బతీసే రెండంచెల వ్యూహంతో జగన్‌ శిబిరం ముందుకు వెళు తోంది. టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకూ కాంగ్రెస్‌ను విమర్శించ కుండా.. కేవలం తన పార్టీని బలోపేతం చేసుకునేందుకే తెలంగాణ ఉద్యమాన్ని వినియోగించుకుంటోందని గ్రహించిన జగన్‌ బృందం, తెలంగాణపై టీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధి కన్నా, తమకే ఎక్కువ అంకితభావం ఉందని చాటేందుకు తానే సొంతంగా ఉద్యమాలు నిర్మించనుంది.

మరోవైపు.. టీఆర్‌ఎస్‌ కూడా డిసెంబర్‌ 31 తర్వాత తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునేందుకు శ్రీ కృష్ణ కమిటీ నివేదికను ఆసరా చేసుకుని ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని, కార్యాచరణకు శ్రీకారం చుట్టనుంది. టీడీపీ, జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌, బిజేపీ సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సంస్థాగతంగా తాను పటిష్ఠంగా లేకపోతే రాబోయే సమస్యలను ఎదుర్కోవడం కష్టమన్న వ్యూహంతో టీఆర్‌ఎస్‌ డిసెంబర్‌ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో తానే ముందు వరసలో ఉండేలా కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటోంది.

మరోవైపు.. తెలంగాణ సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా ఇప్పటినుంచే తెలంగాణ సమస్యపై గళం విప్పకపోతే డిసెంబర్‌ తర్వాత తామెక్కడ వెనుకబడిపోతామోనన్న ఆందోళనతో ఇప్పటినుంచే తెరపైకొస్తున్నారు. ఎంపీ మధుయాష్కీ, వివేక్‌, మందా జగన్నాధం, సీనియర్‌ ఎమ్మెల్యే ఆర్‌, దామోదర్‌రెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, కెఆర్‌ ఆమోస్‌, యాదవరెడ్డి, కమలాకర్‌రావు వంటి నేతలు తెలంగానాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ మాత్రం, కేవలం టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే లక్ష్యంతోనే అడుగులు వేస్తోంది.

కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తనపై ఉందని కేసీఆర్‌ బాహాటంగా వ్యాఖ్యానించిన తర్వాత.. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు, ప్రధానంగా విద్యార్థి జేఏసీ, ఉద్యోగ సంఘాలు దూరమయిన విషయాన్ని గ్రహించిన టీడీపీ, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తన పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉంది. దేవేందర్‌ గౌడ్‌, నాగం, కడియం, మోత్కుపల్లి వంటి నేతలు తెలంగాణ వాదాన్ని మునుపటి కన్నా ఉధృతంగా వినిపిస్తు తమ పార్టీ ఎక్కడా వెనుకబడి పోకుండా జాగ్రత్త పడుతున్నారు.

Sunday, October 31, 2010

రోశయ్యే సుప్రీం ! ‘‘ రోశయ్య సుప్రీం ’’

roshaiah-cmm
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరిపాలన, పార్టీ ప్రజాప్రతి నిధులపై క్రమంగా పట్టుబిగుస్తున్నారు. బలహీన ముఖ్యమంత్రి అన్న భావన నుంచి బయటపడి బలమైన ముఖ్యమంత్రిగా ముద్ర వేస్తున్నారు. కొద్దికాలంపాటు అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ‘‘ముఖ్యమంత్రి మార్పు’’ ఊహాగానాల... నుంచి మళ్లీ పాలనపై పట్టుసాధించే పరిస్థితికి చేరుకొన్నారు. అనారోగ్యం నుంచి తేరుకొని మునుపటి కంటే ఎక్కువగా ప్రభుత్వ శాఖల సమీక్షలకు అధిక సమయం కేటాయిస్తున్నారు. దీనికి తోడు...పార్టీ అధిష్ఠానానికి, తనకు ప్రత్యక్షంగా-పరోక్షంగా కంట్లో నలుసుగా మారిన వై.ఎస్‌.జగన్‌ వ్యవహారం ‘‘పార్టీపరంగా’’ ‘ముగింపు దశకు రావడం, ఆయన విధేయులంతా రోశయ్యకు మద్దతు ప్రకటించడం, ప్రతిపక్షం కూడా వై.ఎస్‌.హయాం స్థాయిలో ఉద్యమించక పోవ టంతో ఇక ఇప్పట్లో కొణిజేటికి తిరుగులేదన్న భావన, ఇక ‘‘ఆయనే సుప్రీం’’ అన్న నమ్మకం పార్టీ వర్గాలలో బలపడుతోంది.

అధిష్ఠానం అండదండలు...
పార్టీలో సమస్యలను ఒక్కటొక్కటిగా అధిగమిస్తూ వస్తున్న రోశయ్యకు అధిష్ఠానం పూర్తిస్థాయిలో దన్నుగా నిలవడంతో ‘‘సుప్రీం’’గా అవతరించారు. అయితే...వై.ఎస్‌.మాదిరిగా దానిని ఎక్కడా కనిపించనీయకుండా ఢిల్లీ పర్యటనలోనూ హడావుడి చేయకుండా, ప్రచారానికి దూరంగా తనదైన శైలిలో వ్యవహరిస్తున్న వైనాన్ని పార్టీ నాయకులు గ్రహించారు. అధిష్ఠానం కూడా... రోశయ్యకు మద్దతు పలకకపోతే పార్టీలో భవితవ్యం ఉండదని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ సొంత విధేయతలను పక్కకుపెట్టి అనివార్య పరిస్థితులలో రోశయ్యకు విధేయత ప్రకటిస్తున్నారు.

దానికి అదనంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులలో ఎక్కువ మద్దతు ఉన్న కేవీపీ రామచంద్రరావు కూడా జగన్‌ను పక్కకు పెట్టి అధిష్ఠానం అండదండలున్న రోశయ్యకే విధేయత ప్రకటించడంతో కెవిపి సలహాల ప్రకారం నడిచే సదరు మెజార్టీ ప్రజాప్రతినిధులంతా ఆయనను అనుసరిస్తున్నపరిస్థితి కనిపిస్తోంది.అందని ముఖ్యమంత్రి కిరీటం కోసం అర్రులు చాస్తూ పార్టీని చీల్చే దిశగా అడుగులు వేస్తున్న జగన్‌కు ఇక పార్టీలో భవితవ్యంలేదని నిర్ధారించుకొన్న ప్రజా ప్రతినిధులంతా నాయకత్వం దన్ను ఉన్న రోశయ్యకు సహాయనిరాకరణ చేస్తే వచ్చే ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్లు కూడా దక్కవన్న భయాన్ని ప్రకాశం జిల్లా జగన్‌ ఓదార్పు యాత్ర సందర్భంగా స్వయంగా గ్రహించారు.

జగన్‌ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్ఠానం స్వయంగా చెప్పడంతో ప్రకాశంజిల్లా ఎమ్మెల్యేలలో ఇద్దరు తప్ప మిగిలిన వారంతా జగన్‌ యాత్రకు ముఖం చాటేసిన విషయం తెలిసిందే. జగన్‌తో ఉంటే భవిష్యత్తులేదని అధిష్ఠానం విస్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో, అంతకు ముందు జగన్‌కు మద్దతు దార్లుగా ఉన్న ప్రజాప్రతినిధులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం రోశయ్యను బలోపేతం చేస్తున్నారు. ఇక పాలనా పరంగా కూడా రోశయ్య పట్టుబిగుస్తున్నారు.

అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత పూర్తిస్థాయిలో ప్రభుత్వ శాఖల సమీక్షలు నిర్వహిస్తున్నారు. బదిలీలు, ప్రాధాన్యతా రంగాలకు నిధుల కేటాయింపులు వివిధ శాఖలలో ఖాళీల భర్తీలపై ఆయన దృష్టి సారిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, నియామకాలు ప్రకటిస్తు న్నారు. కీలకమైన వివాదాలను కూడా ఆయన చాక చక్యంగా పరిష్కరిస్తూ అధిష్ఠానం ప్రశంసలు అందుకొంటున్నారు.

సర్కార్‌ను అతలాకుతలం చేసిన హైకోర్టు న్యాయవాదుల ఆందోళనను సమర్థవంతంగా పరిష్కరించి తానేమిటో, తాన రాజకీయ అనుభవం ఏమిటో చాటారు. ఆంధ్ర-తెలంగాణకు 40 చొప్పున, రాయలసీమకు 20శాతం స్టాండింగ్‌ కౌన్సెల్‌, ఏజిపి, జిపి పోస్టులను ప్రాంతాల వారీగా విభజించి, ఆ సమస్యను అత్యంత సమర్థవంతంగా పరిష్కరించారు. ప్రాణహిత పుష్కరాలు, బతుకమ్మ జాతర వంటి సాంస్కృతికపరమైన అంశాలలో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా...ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి ప్రాంతీయ అభిమానాలు ఉండవని, అన్ని ప్రాంతాలు సమానమేనని చాటిచెప్పి ‘‘తాను ప్రాంతాలకు అతీతుడినినని’’ రుజువు చేసుకొన్నారు. ఇన్ని కీలకమైన వివాదాలు పరిష్కరించి ‘‘రోశయ్య సుప్రీం’’ అనిపించుకొన్నారు.

తగ్గిపోయిన ధిక్కార ధోరణి
రోశయ్య సుప్రీంగా మారుతున్న తీరుతో మంత్రులు సైతం తమ దిక్కారధోరణీ, వ్యవహార శైలినీ మార్చుకొని ఆయనకు పూర్తి విధేయతను ప్రదర్శిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకొంటోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఎవరి ఇష్టంవారిదని ముఖ్యమంత్రి స్పష్టంచేసినప్పటికీ, తెలంగాణకు చెందిన పన్నెండు మంది మంత్రులు మాత్రం అవతరణ దినోత్సవాలలో పాల్గొం టామని స్పష్టంచేయటం రోశయ్యకు పూర్తిస్థాయిలో విధేయత ప్రదర్శించటంగానే స్పష్టమవుతోంది.

డిసెంబర్‌ పరిణామాలకు సిద్ధం
ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తున్న ముఖ్యమంత్రి డిసెంబర్‌ అనంతర పరిణా మాలకు సిద్దంగానే ఉన్నారు. కేంద్రం నుంచి పారా మిలటరీని పిలిపిస్తున్నారు.శాంతి భద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని, అందులో రాజకీయ నేతల ప్రమేయాన్ని సహించవద్దని డిజిపికి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. డిసెంబర్‌ అనంతర పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించటం, కఠి నంగా అణిచివేయటం ద్వారా తాను బలమైన ముఖ్యమంత్రినన్న సంకేతాలు పంపేందుకు రోశయ్య సిద్దమవుతున్నారు.

Monday, October 25, 2010

మంత్రులపై 'రోష'య్య ! * స్వీయ నిర్ణయాలు తీసుకోకపోతే ఎలా?

సిఫార్సు చేయకుండా నాపై తోసేయడం సబబేనా?
ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయరా?
పలువురు మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి, ఆగ్రహం

 కొంతమంది మంత్రులు తమ తమ శాఖలనే పట్టించుకోవడం లేదు. మరికొందరు విధాన నిర్ణయాల విషయంలో చేతికి మట్టి అంటకుండా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలనే ధిక్కరిస్తుంటే.. మరికొందరు స్వీయ నిర్ణయాలు తీసుకోకుండా భారం మొత్తం సీఎంపైనే వేసేస్తున్నారు.

కానీ, సదరు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం లేదు. ఈ నేపథ్యంలోనే, మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వీయ నిర్ణయాలు తీసుకోకుండా తనపైనే బాధ్యతలను నెట్టేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

శాఖాపరంగా పత్రికల్లో వస్తున్న కథనాలపై మంత్రులు సమష్టిగా స్పందించడం లేదని మంత్రివర్గ సమావేశాల్లో తరచూ ఆయన ఆగ్రహిస్తున్నారు కూడా. అధిష్ఠానం అంటే తనకు తెలియదని, తనకు తెలిసిన అధిష్ఠానం వైఎస్సేనని ప్రకటించి తూర్పు గోదావరి జిల్లాలో కడప ఎంపీ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్న మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ వ్యవహార శైలిపై సీఎం అసంతృప్తితో ఉన్నారు.

ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దన్న అధిష్ఠానం ఆదేశాలను ముఖ్యమంత్రి స్వయంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలిపారు. అయినా.. తాను బంధుత్వానికే విలువ ఇస్తానంటూ ఆయన యాత్రలో పాల్గొన్నారు. ఆయన వ్యవహారంపైనా సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇక, ఎరువుల సరఫరా విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో మంత్రి రఘువీరారెడ్డి స్పందించిన తీరు పట్ల సీఎం సంతృప్తి చెందలేదు.

ఈ విషయమై మంత్రి బొత్సతోపాటు పలువురు మంత్రులు మంత్రివర్గ సమావేశంలో రఘువీరాతో వాగ్వాదానికి దిగినా ఏమీ మాట్లాడకుండా సీఎం మౌనం దాల్చడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం పనులు, మహిళా స్వయం సహాయక బృందాలకు పరపతి లభించడంపై కడప ఎంపీ జగన్‌కు చెందిన దినపత్రికలో కథనాలు రావడం పట్ల సంబంధిత మంత్రి వట్టి వసంతకుమార్‌పై కూడా మంత్రివర్గ సమావేశంలో రోశయ్య అసంతృప్తి వ్యక్తం చేశారన్న ప్రచారం ఉంది.

'సాయంత్రం నువ్వు జగన్‌ను కలుస్తావు. మర్నాడు ఆయన పత్రికలో కథనాలు వస్తాయి' అని వ్యాఖ్యానించారని సమాచారం. అలాగే, ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో 42 శాతం వాటా అమలయ్యేలా కృషి చేస్తామంటూ ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రాంత న్యాయవాదులకు ఇచ్చిన హామీ ఏమైందని మంత్రి గీతారెడ్డిని సీఎం ప్రశ్నించారని తెలిసింది.

డీఎస్సీ-08 నియామకాల విషయంలో శాఖాపరంగా సిఫార్సు చేయకుండా సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రకటించిన మాణిక్యవరప్రసాద్‌పైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో తెలంగాణకు 42 శాతం వాటాపై ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు.

గత మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. దానిపై దృష్టిసారించాలని గీతారెడ్డికి సూచించారు. ఇచ్చిన బాధ్యతలను వెంటనే పూర్తి చేయాలని మంత్రుల ఉప సంఘానికి హితవు పలికారు. మంత్రివర్గ సమావేశం జరిగి రోజులు గడుస్తున్నా దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే, తనను కలిసిన గీతారెడ్డితో సీఎం రోశయ్య ఆ అంశాన్ని ప్రస్తావించారు.

'తెలంగాణ న్యాయవాదుల సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆచరణకు నోచుకోలేదు. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వచ్చేస్తోంది. ఆ సమయానికి కూడా ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఏం బాగుంటుంది? దీనిపై వారు నిలదీస్తే ఏమని సమాధానం చెబుతారు?' అని కాస్త ఆగ్రహంతో ప్రశ్నించారు.

సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని ఉన్నా వీలు చిక్కడం లేదని, రెండు రోజుల్లో దానిపై ఓ సిఫార్సు చేస్తామని గీతారెడ్డి జవాబిచ్చారు. 'తెలంగాణ న్యాయవాదులతో సమావేశం జరిపిన రోజే సమయం లేదని చెబితే.. ఆ బాధ్యతను మరొకరికి అప్పగించేవాళ్లం కదా' అని సీఎం ప్రశ్నించారు. ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

ఇక, తనను కలవడానికి మంత్రి మాణిక్యవరప్రసాద్ వచ్చిన సందర్భంలో.. "ఏమిటీ మీరొక్కరే వచ్చారు? డీఎస్సీ-08 ఫైలు ఏదీ!? అధికారులు రాలేదా?'' అని రోశయ్య నిలదీశారు. న్యాయపరమైన అంశాలు మిళితమై ఉన్న ఈ వ్యవహారంలో సీఎం నిర్ణయం తీసుకుంటారంటూ తనపై వదిలేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో "ఇది చాలా కీలకమైన అంశమైనందున ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పాను' అని మంత్రి వివరణ ఇచ్చారు.

అయితే, అధికారులతో కలిసి ప్రభుత్వపరంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయాలో సూచించాలని రోశయ్య చెప్పారు. దీంతో మంత్రి వెంటనే సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో, వివిధ సందర్భాల్లో మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి.. భవిష్యత్తులో ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడతారా!? లేదా? అన్న చర్చనీయాంశంగా మారింది.