Showing posts with label chandra babu. Show all posts
Showing posts with label chandra babu. Show all posts

Saturday, January 14, 2012

పందెం పోరులో రాజకీయ పుంజులు

 

కొక్కొరొ... కొ.. అంటే కొట్లాట
పందెం పోరులో రాజకీయ పుంజులు
ఓట్లు బెట్ కాస్తూ జనం ముందుకు
పొలిటి'కోళ్లు' 

ప్రత్యర్థులపై విచ్చు కత్తులు
తమలో తామే 'కూల్చే ఎత్తులు'
కాంగ్రెస్ బరిలో అనేక కోళ్లు
టీడీపీ, టీఆర్ఎస్‌లో ఫ్యామిలీ ఫైట్
ఎన్నికలు రాక ముందే బరిలోకి
కళ్లలో కసి... కదలికలో వ్యూహం... కత్తిగట్టిన కాలిదెబ్బ... అబ్బో! బరిలో దిగిన పందెం కోళ్ల పౌరుషాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. సంక్రాంతి అంటేనే కొ... క్కొ...క్కొరోకో... కోళ్ల పందేలు! ఇది ఏడాదికో పండగ! కానీ... రాజకీయ పందెం కోళ్లకు నిత్యం సంక్రాంతే! చాన్స్ చిక్కిందంటే... కొట్టుకోవడమే! ఈకలు పీక్కోవడమే! ఈ పొలిటికల్ కోళ్లు ప్రత్యర్థి కోళ్లపై విరుచుకుపడుతుంటాయి. మైకులు పట్టుకు నమిలేస్తుంటాయి. తెలుగుదేశం - కాంగ్రెస్ - టీఆర్ఎస్ ఈ మూడు పార్టీల పందెం కోళ్లు ఒకదానిపై ఒకటి మీదపడి రక్కేసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

తెలుగుదేశం - కాంగ్రెస్ - వైఎస్ఆర్ కాంగ్రెస్ కోళ్లు కూడా కాలి వేళ్లకు కత్తులు కట్టుకుని ఎగురుతుంటాయి. ఇలా పార్టీల మధ్య జరిగే పందేలు ఒకవైపు... ఒకే పార్టీలో ఉంటూ పరస్పరం కొట్టుకునే కోళ్లు మరో వైపు! మొదటిరకం పందేలు అందరికీ తెలిసినవే. రెండో రకం కోళ్ల పందేలు మాత్రం తెరవెనుక జరుగుతుంటాయి. ఈ కోళ్లు అదను చూసుకుని 'కత్తి గోరు' విసిరేందుకు వేచి చూస్తుంటాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా... అన్ని పార్టీల్లోనూ ఈ కుమ్ములాటల కోళ్లు ఉన్నాయి. ఇక చూసుకోండి వాటి రక్కిసలాట...

కాంగ్రెస్‌లో ఎన్నెన్ని కోళ్లో..
ఎక్కడైనా, ఏ బరిలోనైనా ఒక బరిలో, ఒకే సమయంలో రెండు కోళ్లే కొట్టుకుంటాయి. కానీ... కాంగ్రెస్ బరి తరీఖానే వేరు. ఒకేసారి ఆరేడు కోళ్లు బరిలోకి దిగి కీచులాడుకుంటాయి. ఒకే కోడి మీదికి నాలుగైదు కోళ్లు కాలు దువ్వుతాయి. అలాగని ఆ నాలుగైదు కోళ్లు కలిసి మెలిసి ఉంటాయా అంటే అదీ లేదు. ప్రధాన పోటీ మాత్రం... సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సల మధ్యే ఉంటుంది. బరిని విచ్చలవిడిగా ఏలుదామని వచ్చిన కిరణ్‌కు బొత్స పెను సవాల్‌గా మారారు. చీటికి మాటికి ఢిల్లీ పెద్దలను కదలడం, కిరణ్‌ను ఇరుకున పెట్టేలా గుడిసెపైకి ఎక్కి 'కొక్కొరొకో' అనడం బొత్సకు షరా మామూలే.
vestrana

అయితే... మద్యం సిండికేట్‌పై ఏసీబీ దాడులతో బొత్సను డిఫెన్స్‌లో పడేయడంలో కిరణ్ విజయం సాధించారనే చెప్పాలి. ఒక 'కోడి' కొంత దారిన వచ్చిందని అనుకునేలోపే... ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మరింత పెద్ద కత్తులు కట్టుకుని దిగారు. సమన్వయ కమిటీ సమావేశంలో సీఎంను 'అంశాల' వారీగా నిలదీసినట్లు కనిపించినప్పటికీ... పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడటమే తన లక్ష్యమని నిరూపించుకోవడమే రాజనర్సింహ అసలు లక్ష్యం.
అత్యంత ముఖ్యమైన తెలంగాణ అంశంపైనా పార్టీ వైఖరికే కట్టుబడి ఉంటానని ప్రకటించడం, తరచూ ఢిల్లీకి వెళ్లి తన 'ప్రయత్నాలు' సాగించడం ద్వారా రాజనర్సింహ బరిలోని 'పెద్ద కోడి'కి చికాకు తెప్పిస్తున్నారు. బరిని ఏలేందుకు చేతిలో కర్చీఫ్ పట్టుకుని తిరుగుతున్నారు. ఇక చిరంజీవి, నాదెండ్ల మనోహర్ కూడా బరిలో ఉన్నప్పటికీ... కిరణ్‌తో హోరాహోరీగా మాత్రం పోరాడటంలేదు. 'టైమ్ వస్తే దూకుదాం' అని వేచి చూసే రకం! మంత్రి శంకర్రావు వంటి 'చిలిపి కోళ్లు' ఉండనే ఉన్నాయి. అయితే... కాంగ్రెస్ బరిలో ఎప్పుడు, ఏయే కోళ్లు కీచులాడుకుంటాయనేది ఎప్పుడూ ఆసక్తికరమే!
'దేశం' పుంజుల కోలాహలం
తెలుగుదేశం బరిలో రకరకాల కోళ్లు కొట్టుకుంటున్నాయి. టీడీపీ తెలంగాణ ఫోరం బరిలో ఒకవైపు ఎర్రబెల్లి దయాకర రావు, మరోవైపు మోత్కుపల్లి నర్సింహులు! పైకి గాయాలు కనిపించకుండా కొట్టుకోవడమే వీరి 'ఫైట్' ప్రత్యేకత. టీ-టీడీపీ ఫోరం కన్వీనర్‌గా తనకే గుర్తింపు రావాలన్నది ఎర్రబెల్లి ఆరాటం. కేసీఆర్‌పై గొంతు చించుకుని, మేడెక్కి అరిచేది తాను కాబట్టి, తనకే 'పెద్ద కోడి'గా పట్టం కట్టాలనేది మోత్కుపల్లి పోరాటం! అయితే... ఈ రెండు కోళ్లకూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. మోత్కుపల్లిలా గట్టిగా అరవలేకపోవడం ఎర్రబెల్లి బలహీనత. ఎర్రబెల్లి స్థాయిలో సమన్వయ నైపుణ్యం లేకపోవడం మోత్కుపల్లి వీక్‌నెస్.

తెలుగుదేశం 'ఫ్యామిలీ' బరిలోనూ కోళ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. 'పెద్దకోడి' చంద్రబాబుకు తెలుగుదేశం బరిని మరో పదేళ్లపాటు ఏలగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ... 'నెక్ట్స్ ఎవరు?' అనే అంశంపై తేల్చుకునేందుకే పోరు సాగుతోంది. అయితే... ఈ పోరు ఇతర ప్రేక్షకులకు కనిపించేది కాదు. అంతా అంతర్గతమే. ఈ పోరు బరిలో ఉన్నది ఎవరో కాదు! అన్నదమ్ములైన హరికృష్ణ, బాలకృష్ణలే! భవిష్యత్ రాజకీయాలపై వీరిమధ్య అపార్థాలునెలకొన్నాయి. తన కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ కోసం బరిని సిద్ధం చేయాలని హరికృష్ణ ఇప్పటి నుంచే తహతహలాడుతున్నారు.

ఇందుకు బాలకృష్ణ అడ్డొస్తాడన్నది ఆయన భయం. బాలయ్య తన అల్లుడైన నారా లోకేశ్‌నే ప్రమోట్ చేస్తారని భావిస్తున్నారు. దీనికి తగినట్లుగానే, ఇటీవల బాలయ్య 'కూత' ఈమధ్య జోరందుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఈ మధ్య హరికృష్ణ, బాలకృష్ణ పరస్పరం మాట్లాడుకోవడం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ వైపు చూడటమే మానేశారు.

టీఆర్ఎస్‌లో మామా అల్లుళ్ల సవాల్
టీఆర్ఎస్‌లోనూ తెలుగుదేశం తరహా కోళ్ల పందెమే జరుగుతోంది. అటు తెలంగాణ బరిలో, ఇటు టీఆర్ఎస్ పార్టీ బరిలో ఇప్పుడు కేసీఆర్ మాటకు ఎదురే లేదు. ఆయనే నెంబర్ వన్! 'నెంబర్ 2' కోడి ఎవరో తేల్చుకునేందుకు హరీశ్‌రావు, కేటీఆర్‌ల మధ్య పోరాటం జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో హరీశ్‌వర్గం, కేటీఆర్ వర్గం అనే విభజన వచ్చింది.
http://images.blogs.hindustantimes.com/dabs-and-jabs/post/KCR.jpg
కేటీఆర్‌తో పోల్చితే... పార్టీని నడపడం, వ్యూహ రచనలు, సమన్వయ సాధనలో హరీశ్‌రావుకే ఎక్కువ మార్కులు పడతాయి. కానీ... పార్టీ తరఫున అధికారికంగా మాట్లాడే అవకాశం ఎక్కువ సందర్భాల్లో కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్‌కే దక్కుతోంది. దీనిపై హరీశ్‌లో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోకున్నప్పటికీ... గ్రూపులు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. వీరిద్దరి మధ్య పార్టీలోని 'చిన్న కోళ్లు' నలిగిపోతుండటం మాత్రం నిజం.

'దేశం'పై జగన్ గురి

ఇదో చిత్రమైన బరి! ఈ పార్టీలో పెద్ద కోడి జగన్. అయితే... రాష్ట్ర రాజకీయ పోరు మాత్రం జగన్ పార్టీ చుట్టూనే తిరుగుతోంది. 2014లోపు జగన్‌ను బలహీనం చేస్తే తనకు ఎదురేలేదని చంద్రబాబు... బాబును దెబ్బతీస్తే అధికారం తనదేనని జగన్ భావిస్తున్నారు. అత్యంత చిత్రంగా... ఈ పోరులో అధికార కాంగ్రెస్ బరి నుంచి పక్కకు వెళ్లిపోయింది. ఇరుప్రాంతాల్లోనూ కాంగ్రెస్ బలహీనపడిందని జగన్, చంద్రబాబు భావిస్తుండటమే దీనికి కారణం. టీడీపీలోని ప్రధాన పందెం కోళ్లన్నీ జగన్‌ను ఎదుర్కోవడంపైనే దృష్టి పెట్టాయి.

డేగ కళ్లు, వాడి కాళ్లు వేసుకుని... చిన్న అవకాశం దొరికినా దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. జగన్ కూడా అంతే! తాను కేసుల్లో ఇరుక్కోవడంతో చంద్రబాబుపైనా తన తల్లితో కేసులు వేయించారు. విషయాన్ని సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లారు. తనపైనా, తన తండ్రిపైనా ఎవరు ఏ ఆరోపణలు చేసినా, దాని మూలాలు చంద్రబాబు హయాంలోనే ఉన్నాయంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. మొత్తానికి... అధికార పార్టీ అస్త్ర సన్యాసం చేయగా, రెండు ప్రతిపక్ష పార్టీలు కొట్టుకోవడం బహుశా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి.

బహు బరులు... బడా కోళ్లు
కిరణ్ - జగన్, కిరణ్ - చంద్రబాబు, చంద్రబాబు - కేసీఆర్... ఇలా బడా కోళ్ల మధ్య భారీ పోరాటమే జరుగుతోంది. కిరణ్‌ను ముఖ్యమంత్రిగా నియమించడంతో... ఇక తనకు తలుపులు మూసేసినట్లేనని జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చేశారు. ఆ క్షణం నుంచి కిరణ్‌ను బలహీనం చేయడంపై దృష్టి సారించారు. పథకాలు మూలనపడ్డాయని ప్రతి సభలో తిట్టిపోయడం ఇందులో భాగమే. అవిశ్వాసం ద్వారా కోలుకోలేని దెబ్బ కొట్టాలని జగన్ భావించినప్పటికీ... ఈ విషయంలో కిరణ్‌దే పైచేయి అయ్యింది. సామాజిక వర్గం, ప్రాంతం, ఎమ్మెల్యేల మధ్య తమ పట్టు నిలుపుకొనేందుకు కిరణ్, జగన్ మధ్య పోరు జరుగుతూనే ఉంది.

ఇక, తెలంగాణలో చంద్రబాబును బలహీన పరచాలని కేసీఆర్... టీఆర్ఎస్‌ను ఎంతోకొంత నిలువరించాలని చంద్రబాబు పరస్పరం కలహించుకుంటూనే ఉన్నారు. టీడీపీని దెబ్బతీస్తే తెలంగాణలో 80 శాతం సీట్లు స్వీప్ చేయవచ్చన్నది కేసీఆర్ ఆలోచన. ఆ చాన్స్ ఇవ్వకుండా... తెలంగాణలో కొన్ని, సీమాంధ్రలో భారీగా సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అందుకే... టీఆర్ఎస్, టీడీపీ కోళ్ల మధ్య తెలంగాణలో హోరాహోరీ పోరు జరుగుతోంది. 'నువ్వొకటంటే నేను నాలుగంటా' అన్నట్లుగా పోటా పోటీ ప్రెస్ మీట్లు, విమర్శలు! రాజకీయ బరిలో ఇదో రసవత్తర పోరు!

ఈ కోళ్లూ ఉన్నాయ్...

రాజకీయ కోళ్ల పందెంలో సీపీఎం, సీపీఐ బాగా వెనుకబడ్డాయి. 2004-09 మధ్య కాళ్లకు కత్తులు కట్టుకుని వీరోచితంగా పోరు సాగించిన సీపీఎం ఈ మధ్య కాలంలో అస్త్ర సన్యాసం చేసింది. టీడీపీ, కాంగ్రెస్‌లతో వెళ్లలేక... జగన్‌తో జట్టుకట్టే విషయంపై తేల్చుకోలేక... అత్యంత అయోమయంలో పడింది. సీపీఎంతో పోల్చితే సీపీఐ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. 'పుంజు కోడి' నారాయణ నోరే ఈ పార్టీకి కొండంత బలం. వారూ వీరని కాకుండా, ఎవ్వరిపైనైనా ఇంతేసి నోరు వేసుకుని పడటం, ఏదో ఒకస్థాయి పోరాటాలతో ఆయన పార్టీ ఉనికిని కాపాడటంలో విజయవంతం అయ్యారు. టీడీపీతో దోస్తీ సాగించాలని నిర్ణయించుకున్నారు.

ఇక... బీజేపీ పరిస్థితి కూడా అయోమయంలోనే ఉంది. 'తెలంగాణ' నినాదాన్ని టీఆర్ఎస్ తర్వాత అత్యంత స్పష్టంగా భుజానికెత్తుకున్న ఈ పార్టీ సీమాంధ్రలో అడుగుపెట్టలేక పోతోంది. అలాగని... తెలంగాణలో దూసుకుపోతోందా.. అంటే అదీ లేదు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా టీఆర్ఎస్ నీడ నుంచి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే యాత్రల ద్వారా సొంత వ్యూహం రచిస్తోంది.

కొసమెరుపు: పార్టీల పందెం కోళ్లు ఎంతగా కొట్టుకుంటున్నా... ఎవరి బలం ఎంతో తేలేందుకు 2014 దాకా ఆగాల్సిందే. కానీ, బరి సిద్ధకాకముందే, పోటీని వీక్షించే ప్రజలు గుమికూడక ముందే కోళ్లు కొట్టుకోవడం మొదలుపెట్టాయి. మరో రెండేళ్లకు ఎవరి కత్తులు మొద్దు బారిపోతాయో, ఎవరివి వాడిగా ఉంటాయో వేచి చూడాలి మరి! 
http://www.thehindu.com/multimedia/dynamic/00503/16_P1_CARTOON_503599e.jpg

Saturday, January 8, 2011

కిం.. కర్తవ్యం ?

Babu
శ్రీ కృష్ణ కమిటీ నివేదిక పెట్టిన చిచ్చు మూడు ప్రధాన రాజకీయ పార్టీలో ఇంకా రగులుతోంది. కాంగ్రెస్‌-టీడీపీ ఒకేరకమైన సమస్యతో సతమత మవుతుంటే, టీఆర్‌ఎస్‌ మరో రకమైన సమస్యతో ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణపై అనుసరించాల్సిన వైఖరి కాంగ్రెస్‌-టీడీపీలకు ప్రాణసంకటంలా మారగా, కేసీఆర్‌ మాత్రం తన భవిష్యత్‌ రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో కాంగ్రెస్‌పై అనుసరించాల్సిన వ్యూహమేమిటో తెలియక అయోమయంలో ఉన్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ-సీమాంధ్రలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఎలాంటి వైఖరి అనుసరిం చాలో తెలియక అవస్థలు పడుతోంది. ఏ ప్రాంతం వైపు మొగ్గుచూపినా మరొక ప్రాంతంలో దెబ్బ తింటా మన్న భయం వెన్నాడుతోంది.

తెలంగాణ వైపు మొగ్గుచూపినా ఆ రాజకీయ లబ్థి టీఆర్‌ఎస్‌- బీజేపీకి వెళుతుందన్న భయం కూడా లేకపోలేదు. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాజీ నామా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. వారు గతంలో అనుసరించిన వైఖరిని బట్టి, ఈసారి కూడా అంత సీను ఉండదని, మళ్లీ అధిష్ఠానం హెచ్చరికలతో మరోసారి అస్తస్రన్యాసం చేస్తారన్న అంచనా తెలం గాణ ప్రజల్లో ఉంది. పీసీసీ అధ్యక్షుడుడీఎస్‌ స్వయంగా తెలంగాణ నేత అయినప్పటికీ, పార్టీ వైఖరిని ప్రకటిం చలేకపోతున్నారు. మరోవైపు పార్టీ వైఖరితో ప్రజల్లో ముఖం చూపించలేక తెలంగాణ ఎంపీలు తల్లడిల్లిపోతున్నారు. అందుకే భేటీల మీద భేటీలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.

kcrr 

ఇక తెలంగాణ కోసం ఏర్పడిన టీ ఆర్‌ఎస్‌ మరో విచిత్ర మైన ఇరకాటంలో ఇబ్బంది పడింది. సోనియాగాంధీ ఎప్పుడో తెలంగాణ ఇచ్చేసిందని, చంద్రబాబు నాయుడు ఒక్కరే తెలంగాణకు అడ్డుపడుతున్నారని మొన్నటి వరకూ ప్రచారం చేసిన కేసీఆర్‌ ఇప్పుడు యుపీఏ అడ్డం తిరగడంతో ఆత్మరక్షణలో పడ్డారు. శ్రీ కృష్ణ కమిటీ తెలంగాణకు వ్యతిరేక తీర్పు ఇవ్వడంతో సోనియాగాంధీని విమర్శించాలో, వద్దో అర్థం కాక సతమతమవుతున్నారు. నిజంగా సోనియాగాంధీ తెలంగాణ ఎప్పుడో ఇచ్చినట్టయితే, శ్రీ కృష్ణ కమిటీ నివేదిక, దానిపై చిదంబరం భేటీ, మళ్లీ ఈనెలాఖరులో చిదంబరం భేటీ ఎందుకన్న ప్రశ్నలు తెలంగాణలోని సామాన్య జనంలో మొదలు కావడం ఇబ్బంది కలిగిస్తోంది.

తన దీక్ష విరమణ సందర్భంగా డిసెంబర్‌ 9న చిదంబరం చేయవలసిన ప్రకటనను తానే నిర్దేశించానని సగర్వంగా చెప్పు కున్న కేసీఆర్‌.. ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఎందుకు ప్రకటన చేయించలేదంటూ టీఆర్‌ఎస్‌ ప్రతర్థి వర్గాలు నిలదీస్తుండటం ఆ పార్టీకి ఇరకా టంగా పరిణమించింది. బహుశా ఇలాంటి ఇరకాటం తోనే కేసీఆర్‌ జోరు తగ్గించారని, పార్లమెంటు సమావేశాల వరకూ గడువు ఇచ్చి, ఆ లోగా జరిగే పరిణామాలను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలన్న భావనతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇప్పటికీ కేసీఆర్‌ సోనియాగాంధీని విమ ర్శించకపోవడం కూడా చర్చనీయాంశమయింది. భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసమే ఆయన సోనియాను విమర్శించడం లేదని, కాంగ్రెస్‌ను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేకనే ఆయన వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

D.-Sriniva 

అందుకే గత డిసెంబర్‌ ముందున్న స్పీడు, జోరు ఆయనలో కనిపించడం లేదంటున్నారు.అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా తెలంగాణపై సంకట స్థితినే ఎదుర్కొంటు న్నారు. తెలంగాణకు ప్రత్యేక శాఖ ఏర్పాటుచేయా లన్న డిమాండ్‌ పెరుగుతుండటంతో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. గతంలో శ్రీ కృష్ణ కమిటీపై పెదవి విప్పకుండా రెండు ప్రాంతాల నేతలతోనే మాట్లాడించిన బాబు, ఈసారి కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. సీమాంధ్రలో కూడా పార్టీని కాపాడుకునే అవసరం ఉన్నందున, తెలంగాణ నేతల స్వేచ్ఛకు అడ్డు రాకుం డానే అటు పార్టీని, ఇటు రెండు ప్రాంతాల నాయకుల ను కాపాడుకోవటం సవాలుగా పరిణమించింది.

ఇటీవల చిదంబరం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి గైర్హాజరవడం ద్వారా తెలంగాణ విద్యార్థి జేఏసీలు, ఉద్యమ సంఘాల వ్యతిరేకత తగ్గించుకున్న బాబు, ఈనెలాఖరులో మళ్లీ ఢిల్లీలో జరిగే భేటీకి హాజరుకా వాలా వద్దా అన్న అంశంపై తర్జనభర్జన పడుతు న్నారు. సోనియా ఎప్పుడో తెలంగాణ ఇచ్చేసిందని, తానే అడ్డుపడుతున్నానంటూ కేసీఆర్‌ ఇప్పటివరకూ చేసిన ఆరోపణలో నిజం లేదని తెలంగాణ ప్రజలకు స్పష్టమయినందున, ఆ తర్వాత పరిణామాలు తమ పార్టీకి ఏ మేరకు లాభిస్తాయోనని వేచిచూస్తున్నారు. ఈలోగా తెలంగాణ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ను ముద్దాయిగా నిలబెట్టా లన్న వ్యూహం అనుసరిస్తున్నారు.

Wednesday, December 15, 2010

రైతుల ఓట్లు దున్నేదెవరు ?

Farmer
రాష్ట్ర రాజకీయాలు రైతుజపంతో మార్మోగుతోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్‌ - తెలుగుదేశం - జగన్‌ పార్టీలు మధ్యంతర ఎన్నికల వ్యూహంతో రైతులపై ఇప్పటినుంచే ఓట్ల గాలం వేస్తున్నాయి. రాష్ట్ర - దేశ రాజకీయాల్లో రాజకీయ అస్థిర పరిస్థితి నెలకొన్నందున, మధ్యంతరం ఎప్పుడయినా తధ్యమన్న ముందుచూపుతో ఈ మూడు పార్టీలూ హటాత్తుగా రైతుల ఓట్లు దున్నేందుకు సరికొత్త వ్యూహాలకు తెరలేపాయి. తమ విజయసోపానికి నిచ్చెన వంటి రైతుల ఓట్లను సాధించేందుకు రకరకాల ఎత్తుగడ లకు శ్రీకారం చుట్టాయి. తామే రైతుల ఆత్మబంధువులమనే ముద్ర వేయించుకునేందుకు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి.

ఈ క్రమంలో.. ఇటీవల రాష్ట్రంలో వచ్చిన తుపాన్లకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, తక్షణం రుణాలు మాఫీ చేయాలని, కౌలు రైతులను ఆదుకోవాలన్న అంశంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, సొంత పార్టీ స్థాపనకు ఉరకలు వేస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కారుకు డెడ్‌లైన్లు విధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు మాత్రం రైతులకు తమ పార్టీనే మేలు చేస్తుందని ఎదురుదాడి చేస్తున్నారు.

ఈనెల 16లోగా రైతు సమస్యలు పరిష్కరించి, రుణాలు మాఫీ చేయకపోతే 17 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని చంద్రబాబునాయుడు సర్కారును హెచ్చరించారు. జల్‌, లైలాతో పాటు గత 15 నెలల నుంచి రాష్ట్రంలో తలెత్తుతున్న ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతున్న రైతాంగాన్ని పరామర్శించేందుకు బాబు.. ప్రభుత్వాధినేతల కంటే ముందే జిల్లాలకు వెళ్లి, వారికి దన్నుగా నిలుస్తున్నారు. ఇది రైతాంగంలో ఆయనపై ;ఆనుకూల వైఖరి పెరగడానికి కారణ మయింది. ఇటీవల నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ప్రకా శం, అంతకంటే ముందు తూర్పు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతు బాట నిర్వహించి సర్కారు వైఫల్యాలపై విరుచుకుపడ్డారు.

గత రెండురోజుల నుంచి శాసనసభలో రైతు సమస్యలపై చర్చించాలని పట్టుపట్టి, అందులో భాగంగా, అరెస్టయి పోలీసుస్టేషన్‌ లోనే నిద్రించిన బాబు, తాజాగా మంగళవారం నాటి సభలో కూడా సర్కారుతో రైతు సమస్యలపై యుద్ధానికి దిగారు. సీఎంపై కన్నెర్ర చేశారు. పోలీసుస్టేషన్‌ నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర నిర్వహించారు. నేతల పోరా టానికి మద్దతుగా పార్టీ కార్యకర్తలు కూడా అసెంబ్లీ వద్ద హంగామా సృష్టించారు. సభ లోపల రైతు సమస్యల పరి ష్కారం కోసం విరుచుకుపడిన టీడీపీ సభ్యులుబాబు సహా సస్పెండ్‌కు గురయ్యారు. రాత్రంతా సభ ఆవరణలోనే బైఠాయించారు. సభలో హంగామా సృష్టించారు.
ఇక కొత్తగా రైతుల సమస్యల కోసం గళం విప్పిన జగన్‌.. ఈనెల 20 లోగా రుణాలు మాఫీ చేయకపోతే విజయవాడలో లక్షమందితో కలసి 21,22వ తేదీల్లో నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు.

రైతులు మానసిక వేదనకు గురవుతున్నారని, రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. ఆ సందర్భంగా వైఎస్‌ చేసిన ‘మేళ్లను’ ఏకరవు పెట్టారు. ఆయన ఇటీవల గుంటూరు, కృష్ణాజిల్లాలలో పర్యటించి రైతులను పరామర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఇటీవల తుపాను సందర్భంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించి, రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ అంశంలో ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితిలో లబ్థిపొందకుండా కిరణ్‌ తన యంత్రాంగాన్ని విపక్షంపై విమర్శలు కురిపించేలా సన్నాహాలు చేస్తున్నారు.

రైతుబాటలో ఏ పార్టీ వ్యూహమేమిటి ?
కాంగ్రెస్‌ పార్టీ
  • బాబు, జగన్‌కు పొలిటికల్‌ మైలేజీ ఇస్తే ప్రమాదకరం.
  • ప్రధానంగా గత 15 నెలల నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్న బాబుపై రైతాంగం సానుకూలంగా వ్యవహరించడంతో అప్రమత్తం కావడం అనివార్యంగా మారింది.
  • కొత్తగా తెరపైకొచ్చిన జగన్‌ కూడా రైతుల ఓట్ల కోసం వల వేయడంతో మరింత ఆందోళన.
  • టీడీపీ దూకుడుకు అడ్డువేసేందుకు బాబుపై సభలోనే రఘువీరారెడ్డితో సీఎం కిరణ్‌ విమర్శల వ్యూహం.
  • రైతుసర్కారని వైఎస్‌ వేసిన ముద్రను పార్టీకి కొనసాగించకపోతే రైతుల ఓట్లు పోవడం ఖాయం.

    తెలుగుదేశం
  • ‘రైతు వ్యతిరేకి’ ముద్రను తొలగించుకోవాలన్న వ్యూహం.
  • రైతాంగంలో బలపడిన ‘ప్రభుత్వ వ్యతిరేకవైఖరి’ని మరింత పెంచే ఎత్తుగడ.
  • ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముఖ్యమంత్రులు, మంత్రుల కంటే ముందే బాబు తమ వద్దకు వస్తున్నారన్న ‘రైతుల సానుకూల భావన’ను మరింత బలపడేలా చేయడం.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం సహాయంలో వైఫల్యం చెందిందన్న రైతుల ఆగ్రహాన్ని ఇప్పటినుంచే ఓటు బ్యాంకుగా మలచుకోవడం.
    జగన్‌ పార్టీ
  • సొంత పార్టీకి ముందే రైతుమంత్రం ద్వారా ముందస్తుగానే వారి మనసు గెలుచుకునే వ్యూహం.
  • దాని ద్వారా తన తండ్రి వైఎస్‌పై ఉన్న రైతుబాంధవుడన్న ముద్రపై పేటెంటీ సాధించడం.
  • నిరాహారదీక్ష ద్వారా తనకూ రైతు సమస్యలపై అవగాహన ఉందని చాటుకోవడం.
  • ఇక ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేస్తానంటూ కాంగ్రెస్‌ సర్కారుకు ఓ హెచ్చరిక.
  • రైతుల కోసం పోరాటం ద్వారా అటు కాంగ్రెస్‌-ఇటు తెలుగుదేశం పార్టీకి డేంజర్‌ సిగ్నల్స్‌ పంపించడం.

Tuesday, December 7, 2010

జగన్‌ సరికొత్త తెలం‘గానం’ సురేఖాస్త్రం !

jaga

డిసెంబర్‌కు ముందే తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఊహించని విధంగా మలుపు తిరుగుతాయని అంచనా వేస్తున్న ప్రధాన పార్టీలు ఆ మేరకు ఇప్పటినుంచే వ్యూహరచన, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా.. రాజకీయ పార్టీ స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణపై దృష్టి సారించారు. ఒకవేళ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడినప్పటికీ, అక్కడ కూడా తాను బలీయ శక్తిగా ఉండేందుకు జగన్‌ ఇప్పటినుంచే ముందుచూ పుతో వ్యవహరిస్తున్నారు. తాను తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని జగన్‌ స్పష్టం చేయనున్నారు.

ఈ విషయంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారిలోనే పయనిం చనున్నారు. ‘జగన్‌ తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. తెలుగు ప్రజలంతా సమానమే. ఆయన రాష్ట్ర విభజనకు అనుకూ లమే. ఒకవేళ రాష్ట్ర ం విడిపోతే మాది జాతీయ పార్టీ అవుతుంది. రాష్ట్ర విభజన అనేది ఇప్పటి సీఎంతో సహా ఎవరి చేతుల్లోనూ లేదు. అది కేంద్రం రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయం. కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించాలన్నది జగన్‌ అభిమతమ’ని ఆయన సన్నిహిత సహచరుడొకరు వ్యాఖ్యా నించారు.

ఇదిలాఉండగా, తెలంగాణలో కూడా తన పార్టీ శక్తివం తంగా తయారుకావాలంటే తెలంగాణ అనుకూల వైఖరి తీసుకో కతప్పదని జగన్‌ శిబిరం నిర్ణయించింది. అందులో భాగంగా.. జనవరి 1 నుంచి బీసీ మహిళా ఎమ్మెల్యే, జగన్‌కు వీర విధేయురాలయిన కొండా సురేఖ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు డిసెంబర్‌ 15 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమ కమిటీలు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి నుంచి టీఆర్‌ఎస్‌కు మించిన ఊపుతో ఉద్యమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అటు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో మౌనంగా ఉండిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు తెలంగానంపై నోరు మెదపని వైఖరి అవలంబిస్తున్నందున.. తాము ఉద్య మాన్ని చేతులోకి తీసుకోవడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లను తెలంగాణ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టేందు కు జగన్‌ శిబిరం వ్యూహరచన చేస్తోంది. జగన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నిష్ర్కమించేందుకు ప్రధాన కారకులయిన తెలంగాణ సీనియర్లకు సరైన సమయంలో సరైన గుణ పాఠం చెప్పాలని జగన్‌ శిబిరం యోచిస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక బీసీ మహిళా ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ నేతృత్వంలో మొదలుపెట్టడం ద్వారా.. వ్యక్తిగతంగా సీనియర్లను, సంస్థాగతంగా కాంగ్రెస్‌ పార్టీని ఏకకాలంలో దెబ్బకొట్టాలన్న వ్యూహం స్పష్టంగా కనిపి స్తోంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖను ముఖ్యమంత్రిగా ముందే ప్రకటించాలన్నది జగన్‌ శిబిరం వ్యూహమని సమాచారం.

తెలంగాణ వస్తే దళితుడిని సీఎంగా చేస్తానని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. బీసీ, దానికితోడు మహిళయిన సురేఖను సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణలో 65 శాతం బీసీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే వ్యూహంతో ముందుకు వెళుతోంది. టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో కలసిపోయిన సంకేతా లు స్పష్టమయినందున.. ఆ పార్టీని కూడా దెబ్బతీసే రెండంచెల వ్యూహంతో జగన్‌ శిబిరం ముందుకు వెళు తోంది. టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకూ కాంగ్రెస్‌ను విమర్శించ కుండా.. కేవలం తన పార్టీని బలోపేతం చేసుకునేందుకే తెలంగాణ ఉద్యమాన్ని వినియోగించుకుంటోందని గ్రహించిన జగన్‌ బృందం, తెలంగాణపై టీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధి కన్నా, తమకే ఎక్కువ అంకితభావం ఉందని చాటేందుకు తానే సొంతంగా ఉద్యమాలు నిర్మించనుంది.

మరోవైపు.. టీఆర్‌ఎస్‌ కూడా డిసెంబర్‌ 31 తర్వాత తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునేందుకు శ్రీ కృష్ణ కమిటీ నివేదికను ఆసరా చేసుకుని ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని, కార్యాచరణకు శ్రీకారం చుట్టనుంది. టీడీపీ, జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌, బిజేపీ సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సంస్థాగతంగా తాను పటిష్ఠంగా లేకపోతే రాబోయే సమస్యలను ఎదుర్కోవడం కష్టమన్న వ్యూహంతో టీఆర్‌ఎస్‌ డిసెంబర్‌ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో తానే ముందు వరసలో ఉండేలా కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటోంది.

మరోవైపు.. తెలంగాణ సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా ఇప్పటినుంచే తెలంగాణ సమస్యపై గళం విప్పకపోతే డిసెంబర్‌ తర్వాత తామెక్కడ వెనుకబడిపోతామోనన్న ఆందోళనతో ఇప్పటినుంచే తెరపైకొస్తున్నారు. ఎంపీ మధుయాష్కీ, వివేక్‌, మందా జగన్నాధం, సీనియర్‌ ఎమ్మెల్యే ఆర్‌, దామోదర్‌రెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, కెఆర్‌ ఆమోస్‌, యాదవరెడ్డి, కమలాకర్‌రావు వంటి నేతలు తెలంగానాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ మాత్రం, కేవలం టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే లక్ష్యంతోనే అడుగులు వేస్తోంది.

కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తనపై ఉందని కేసీఆర్‌ బాహాటంగా వ్యాఖ్యానించిన తర్వాత.. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు, ప్రధానంగా విద్యార్థి జేఏసీ, ఉద్యోగ సంఘాలు దూరమయిన విషయాన్ని గ్రహించిన టీడీపీ, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తన పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉంది. దేవేందర్‌ గౌడ్‌, నాగం, కడియం, మోత్కుపల్లి వంటి నేతలు తెలంగాణ వాదాన్ని మునుపటి కన్నా ఉధృతంగా వినిపిస్తు తమ పార్టీ ఎక్కడా వెనుకబడి పోకుండా జాగ్రత్త పడుతున్నారు.

Monday, November 29, 2010

చిరంజీవి పార్టీలో చిచ్చు: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా?


కాంగ్రెసు పార్టీకి, లోకసభ సభ్యత్వానికి వైయస్ జగన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. కాగా, వైయస్ జగన్ రాజీనామా చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చిచ్చు పెట్టింది. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరాలా, వద్దా అనే విషయంపై చిరంజీవి తన పార్టీ శాసనసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వంలో చేరే విషయంపై లేదా ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంపై చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడారు. తమ 18 శాసనసభ్యుల్లో 16 మంది శాసనసభ్యులు కచ్చితంగా ప్రభుత్వానికి మద్దతిస్తారని, తన వెంట నడుస్తారని ఆయన చెప్పినట్లు సమాచారం. శోభా నాగిరెడ్డి, మహేశ్వర్ రెడ్డిలపై ఆయన అమమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. వారితో పాటు మరో ఎమ్మెల్యే కూడా వైయస్ జగన్ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదనే దీమాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అందుబాటులో ఉన్న శాసనసభ్యులతో, ఎమ్మెల్సీలతో సమావేశమై ఆ మేరకు ఆయన హామీ ఇచ్చారు. వైయస్ జగన్ వర్గం ప్రయత్నాలను ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెసుకు శాసనసభలో 156 మంది శాసనసభ్యులున్నారు. ప్రజారాజ్యం పార్టీకి 18 మంది, తెలంగాణ రాష్ట్ర సమితికి 11 మంది, మజ్లీస్ కు ఏడుగురు, సిపిఐకి ఏడుగురు, సిపిఎంకు ఒక్కరు, తెలుగుదేశం పార్టీకి 90 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. శాసనసభలో ప్రభుత్వానికి కనీసం 147 మంది శాసనసభ్యుల బలం అవసరం. వైయస్ జగన్ వర్గం వెళ్లిపోయినా అంతకన్నా ఎక్కువే బలం ఉంటుందని కాంగ్రెసు అధిష్టానం విశ్వాసంతో ఉంది. వైయస్ జగన్ వెంట 15 మందికి మించి శాసనసభ్యులు వెళ్లిపోరనే విశ్వాసంతో ఉంది. ఆ మేరకు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 16 మంది మద్దతిస్తారని భావిస్తున్నారు. ఎక్కువలో ఎక్కువగా జగన్ వెంట 26 మంది శాసనసభ్యులు వెళ్లిపోయినా నష్టం లేదనే భావనతో కాంగ్రెసు నాయకత్వం ఉంది.

తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదని, అందు వల్ల ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ముందుకు రాదని అంటున్నారు. మజ్లీస్ కూడా కాంగ్రెసు వైపే ఉండే అవకాశం ఉంది. తెరాస మద్దతివ్వకపోవచ్చు. తెరాస మద్దతు తీసుకోవాలంటే పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. తెలంగాణ డిమాండ్ ను ఆ పార్టీ మరోసారి ముందుకు తేవచ్చు. అందువల్ల తెరాస మద్దతు తీసుకునే వైపుగా ఆలోచన చేయకపోవచ్చు. ఇతరులను కూడా తమ వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ప్రభుత్వం పడిపోదని వైయస్ జగన్ వర్గానికి చెందిన గోనె ప్రకాశ రావు స్వయంగా చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన వైయస్ జగన్ కు లేదని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు కూడా చెబుతున్నారు. పరిస్థితిని గమనించే జగన్ వర్గం ఆ విధమైన వాదనలను ముందుకు తెచ్చి ఉంటారని భావిస్తున్నారు.

కాగా, వైయస్ జగన్ వెంట ఎవరూ వెళ్లరని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. వైయస్సార్ పై సానుభూతితో అప్పట్లో వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని 150 మంది సంతకాలు చేశారని, తాను కూడా సంతకం చేశానని, ఆ పరిస్థితి ఇప్పుడు లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ మాటల్లో రాజకీయ పరిపక్వత లేదని ఆయన విమర్సించారు. ఎవరో పార్టీ పెడతారని కాంగ్రెసును వీడి వెళ్లేది లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా రాజీనామా చేసే విషయంపై పునరాలోచన చేస్తానని చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్ది వైయస్ జగన్ కు మద్దతు తగ్గుతూ పోతుందని కాంగ్రెసు అంచనా. దానివల్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని అంటున్నారు.

Saturday, October 23, 2010

చంద్రబాబు తడబాటు



ఈరాష్ట్రాన్ని దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిలో నాయకత్వ పటిమ, దృఢ చిత్తం లోపిస్తున్నదా? వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణం తర్వా త, ఆ స్థాయిలో ఉన్న చంద్రబాబు మరింత బలపడవలసి ఉండగా, రాజకీయ ప్రత్యర్థులకు అలుసుగా ఎందుకు మారుతున్నారు? ఏదో తెలియని ఆరాటంతో వ్యవహరించవలసిన అవసరం ఆయనకు ఏమి వచ్చింది? ప్రస్తుతం ఈ ప్రశ్నలు రాజకీయ పరిశీలకులనే కాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ను సైతం వేధిస్తున్నాయి.

ప్రధాని మన్మోహన్‌సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు, ప్రతిపక్షాల తరఫున ఆయన అపాయింట్‌మెంట్ కోరి భంగపడిన చంద్రబాబు, నేరుగా ధర్నాకు నాయకత్వం వహించడమే కాకుండా, ప్రధానిని 'శాడిస్టు'గా అభివర్ణించి, విమర్శల జడివానలో చిక్కుకున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కావాలంటే ముందుగానే ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించవలసి ఉంటుందని చంద్రబాబుకు తెలియంది కాదు.

తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేయడమే కాకుండా, ఒక దశలో దేశ ప్రధానుల నియామకంలో కీలక పాత్ర వహించిన చంద్రబాబుకు పద్ధతులు తెలియకుండా ఎలా ఉంటాయి! అధికారానికి ఆమడ దూరం లో ఉండే పార్టీలు, అర్ధంతరంగా ప్రధాని అపాయింట్‌మెంట్ కోరి, అది లభించని పక్షంలో ధర్నాలు చేయడం వేరు. ఆయా సందర్భాలలో గొంతెమ్మ కోర్కెలు కోరవచ్చు కూడా! అధికారంలో ఉంటే ఎదురయ్యే సాధకబాధకాలు క్షుణ్ణంగా తెలిసిన చంద్రబాబు ఇలా వ్యవహరించడం, మాటలు తూలడం వల్ల ఆయనే నష్టపోతున్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు పట్ల ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, జాతీయస్థాయిలో ఆయనకు ఇంకా గౌరవం మిగిలే ఉంది. సంస్కరణల పట్ల మక్కువ చూపే ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కూడా చంద్రబాబు అంటే గౌరవం ఉంది. అయితే ఒకప్పుడు తాను జాతీయస్థాయి నాయకుడుగా ఒక వెలుగు వెలిగిన విషయాన్ని చంద్రబాబు మరచిపోవడం విచారకరం. తన స్థాయిని మరచి, చిన్న చిన్న విషయాలలో కూడా ఆందోళనలకు తానే నాయకత్వం వహించాలని, ప్రత్యక్షంగా పాల్గొనాలని ఉబలాటపడటం వల్ల, ఆయన ఇమేజ్ పెరగకపోగా నష్టం జరుగుతున్నది.

ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఆత్మ స్థైర్యం నింపి, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు పార్టీ నేతలను కార్యోన్ముఖులను చేయవలసింది పోయి, అన్నీ తానే చేయాలనుకోవడం ఆయన స్థాయి నాయకుడికి తగని పని! ఒకవైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమం, మరోవైపు కాంగ్రెస్‌తో జత కట్టడానికి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సిద్ధపడడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.పి. జగన్మోహనరెడ్డి జిల్లాల్లో తిరుగుతూ, ప్రజా బలం సమకూర్చుకోవడానికి ప్రయత్నించడం వంటి చర్యల వల్ల చంద్రబాబుకు ఊపిరాడని పరిస్థితి ఉన్న మాట వాస్తవం.

అయితే సమస్యలు చుట్టుముట్టినప్పుడు తొట్రుపాటు పడకుం డా, ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి, ప్రతి వ్యూహాలను రచిం చి, నాయకత్వ పటిమను నిరూపించుకున్న వారే నిజమైన నాయకులు అవుతారు. చంద్రబాబు వ్యవహార శైలి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మిత్రపక్షాలుగా పేర్కొనవచ్చో లేదో తెలియని స్థితిలో ఉన్న వామపక్షాలకు చెందిన రాష్ట్ర నాయకు లు కూడా, ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వనందుకు నిరసన గా నిర్వహించిన ధర్నాకు దూరంగా ఉంటే, రాష్ట్రంలో ఏకైక నాయకుడుగా నిరూపించుకోవలసిన చంద్రబాబు ఆ ధర్నా లో పాల్గొన్నారు.

అంతేగాకుండా ధర్నాలను నిరోధించవలసి న పోలీసు అధికారులపై చిరాకు పడటం ఆయన స్థాయికి తగని పని. అధికారిక విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీ సు అధికారులపై ఉంటుందన్న విషయం ఒక మాజీ ముఖ్యమంత్రికి తెలియదని ఎలా అనుకోగలం! ఈ ఒక్క సందర్భంలోనే కాదు... గతంలో కూడా ఆయన పోలీసు అధికారులపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నాయకు లు ప్రజల కోసం నటిస్తారు.

కానీ అధికారం చలాయించిన వారు నటించాలనుకుంటే వారి గౌరవానికే భంగం. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో చురుగ్గా ఉండే వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఒక పర్యాయం అబిడ్స్‌లోని ఎన్.టి.ఆర్. నివాస గృహంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, వరండాలో ధర్నాకు దిగారు. ఆ సమయంలో గండిపేట కుటీరంలో విశ్రాంతి తీసుకుంటున్న (నిద్ర పోతున్న) రామారావు, హుటాహుటిన అబిడ్స్‌లోని తన నివాస గృహానికి తిరిగి వచ్చారు.

ఆయన వచ్చేలోపు పోలీసులు, అతి కష్టం మీద వై.ఎస్.ఆర్.తోపాటు ధర్నాలో పాల్గొన్న శాసనసభ్యుల ను అరెస్టు చేసి పంపించి వేశారు. ఆ తర్వాత... పరిస్థితి అంత దూరం రావడానికి కారకులైన అధికారులపై ఎన్.టి.ఆర్.తోపాటు, అప్పు డు తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉన్న చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో సందర్భంలో... ఎన్.టి.ఆర్. సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లకుండా, రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్త లు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో ఖిన్నుడైన ఎన్.టి.ఆర్, ఎండలోనే నడిరోడ్డుపై, సచివాలయం ప్రధాన గేటు ఎదురుగా పడుకుని నిరసన తెలిపారు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేయవలసి వస్తున్నదంటే, అధికారానికి దూరంగా ఉన్న రాజశేఖరరెడ్డి అప్పట్లో అలాంటి పనులు చేసినా చెల్లుబాటు అయింది.

కానీ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చేసి, ప్రతిపక్షంలో ఉండి, ఆ పనులు చేసి ఉంటే కచ్చితంగా అభ్యంతరకరమే అవుతుంది. ఈ వాస్తవాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. ప్రధానిని దూషించిన చంద్రబాబుపై ముప్పేట దాడి జరుగుతున్నా, మిత్రపక్షాలకు చెందిన వారెవ్వరూ ఆయనకు అండగా నిలవకపోవడం గమనార్హం.

చంద్రబాబు రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకు న్న విషయం వాస్తవమే! అంతమాత్రాన తొట్రుపడుతూ, దృఢ చిత్తాన్ని ప్రదర్శించకపోతే ఆయనకు మరింత నష్టం జరుగుతుంది. ఆచరణలో జరుగుతున్నది అదే! తెలంగాణ అంశాన్నే తీసుకుందాం. డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, రాజకీయంగా తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించారు.

అయితే అదంతా ఆయన గొప్ప వల్ల కాదు. కేంద్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న నిర్ణయం ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో దెబ్బతిన్నాయి. అయితే తెలంగాణ ఇవ్వడం, ఇవ్వకపోవడం కాంగ్రెస్ చేతిలోనే ఉంది కనుక, ఆ పార్టీ తిరిగి కోలుకునే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంలో అటు కేంద్ర ప్రభుత్వాన్ని గానీ, ఇటు తెలంగాణ ప్రజలను గానీ ప్రభావితం చేయలేని స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అయోమయంలో పడిపోయింది.

తెలంగాణ రాకపోవడానికి చంద్రబాబు ప్రధా న అడ్డంకి అని టి.ఆర్.ఎస్. చేస్తున్న ప్రచారం, ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నది. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును దాదాపు విలన్‌గా చిత్రించడంలో టి.ఆర్.ఎస్. నాయకులు విజయం సాధించారు. దీనితో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకు లు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నా రు. అందువల్లే 'ఢిల్లీలో-జిల్లాల్లో ధర్నా' కోసం గురువారం విడుదల చేసిన కర పత్రాలలో చంద్రబాబు బొమ్మ లేకుండా ఆ పార్టీ నాయకులు జాగ్రత్త తీసుకున్నారు.

ఇది నిజంగా చంద్రబాబుకు అవమానకరమే! అంతమాత్రాన డీలా పడిపోతే ఎవరైనా నాయకుడు ఎలా అవుతారు? తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాం ధ్ర నాయకులు కూడా అడ్డు పడుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రమే అడ్డుపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నిరోధించపోవడం ఆ పార్టీ వైఫ ల్యం. తన పార్టీ శ్రేణులను ఆ మేరకు సన్నద్ధం చేయలేకపోవడం చంద్రబాబు వైఫల్యం.

చంద్రబాబు భవిష్యత్తు సంగతి పక్కనబెట్టి, తమ రాజకీయ భవిష్యత్తుదెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ ఇంటి ఎదుట ఆదివారం నాడు ధర్నా చేయాలని వారు నిర్ణయించుకున్నారు.

తెలంగా ణ ఏర్పాటు అంశంపై ఇప్పటికే కేంద్రం శ్రీకృష్ణ కమిటీని నియమించినందున, ఆ కమిటీ నివేదిక వచ్చేవరకు మౌనం గా ఉండాలని నిర్ణయించుకున్న టి.ఆర్.ఎస్. అధినేత కె.చంద్రశేఖరరావు, ఈ వ్యవధిలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడానికి కంకణం కట్టుకున్నారు. తెలంగాణ కు అనుకూలంగా చంద్రబాబు ప్రకటన చేయాలని ప్రతిరోజూ కోరుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు, తమ పార్టీకీ చెందిన సీమాంధ్ర నాయకులు తెలంగాణ కు అడ్డుపడుతున్న విషయం గురించి మాట్లాడరు.

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా ఈ విషయంపై స్పందించరు. వాస్తవానికి రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది ఎటువంటి పరిస్థితో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీది అటువంటి పరిస్థితే! అయినా చంద్రబాబు టార్గెట్ అవుతున్నారంటే రాజకీయాలలో అది సహజం. రాజకీయాల లో ఇందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యపోవాలి. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరిస్తే, టి.ఆర్.ఎస్.తో కలిసినా, కలవకపోయినా తెలంగాణ ప్రాంతంలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుంది.

ఈ కారణంగా సీమాంధ్రలో నష్టం జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఒకవేళ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తే, సీమాంధ్రలో ఆ పార్టీకి ప్రయోజనం చేకూరవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా, తెలుగుదేశం పార్టీకి చేకూరే ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. తెలంగాణ కోసం ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం నాయకులు ఎన్ని వీధి పోరాటాలు చేసినా ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని చెప్పలేం.

ఎందుకంటే తెలంగాణకు సింబల్‌గా కె.సి.ఆర్. ఇదివరకే అవతరించారు. రాష్ట్ర భవిష్యత్తుపై కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రయోజనం పొందలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. మంచోచెడో ప్రజారాజ్యం పార్టీ సమైక్యాంధ్ర నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిం ది. కాంగ్రెస్‌తో పోల్చితే తనది భిన్నమైన పరిస్థితి అని అంచ నా వేసుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు.

సంకట స్థితి ఎదురైనపుడే నాయకుడన్నవాడు స్థిత ప్రజ్ఞత ప్రదర్శించాలి. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను విశ్లేషించుకుని, ప్రతివ్యూహాలను రచించుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా అవస రం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయా రు కాకుండా ఉండాలంటే, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇప్పటికైనా ఉమ్మడిగా పరిస్థితులను విశ్లేషించుకుని, పద్మవ్యూహం నుంచి బయటపడడం ఎలాగో ఆలోచించుకోవాలి.

ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నట్టు కనిపించని చంద్రబాబునాయుడు, కనీసం ప్రజల దృష్టిలో మరింత పలుచన అయ్యే చర్యలకు దూరంగా ఉంటే మంచిది. నిజానికి తెలుగుదేశం పార్టీకి ఇది అత్యంత గడ్డు కాలం. ఈ గండం నుంచి గట్టెక్కడం అంత సులువైన విషయం కాదు.

అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కనుక, అవకాశం కోసం ఎదురు చూస్తూ, ప్రత్యర్థుల ఎత్తుగడలకు దీటుగా వ్యూహ రచన చేసుకుని, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం మినహా తెలుగుదేశం పార్టీగానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుగానీ చేయగలిగింది ఏమీ లేదు. చంద్రబాబు ఇందుకు భిన్నంగా తొందరపాటుతో వ్యవహరిస్తూపోతే ఆయనలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్నాయని ప్రజలు కూడా నమ్మే స్థితి వస్తుంది. 

-ఆదిత్య