Friday, May 20, 2011

దగా సొమ్ముతో ధగ ధగ * కళ్లు చెదిరే రీతిలో జగన్ మాయా మహల్ * ఎన్నో ప్రశ్నలు

దగా సొమ్ముతో ధగ ధగ
కళ్లు చెదిరే రీతిలో జగన్ మాయా మహల్
వైఎస్ కుమారుడి విస్తృత ధన ప్రదర్శన 


 
దీనికి 55 ఏళ్ల పునాది
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ముంబైలో కట్టుకున్న 27 అంతస్తుల ఇల్లు ఇది. భారతదేశంలో అతి పెద్ద నివాస గృహాల్లో ఒకటైన ఈ ఇంటి పేరు ఆంటిలియా. 4,532 చదరపు మీటర్ల స్థలంలో 4 లక్షల చదరపు అడుగుల మేర నిర్మించిన ఈ భవనంలో 168 కార్ల పార్కింగ్‌కు అవసరమైన స్థలం, వాహనాల నిర్వహణకు ఒక పూర్తి అంతస్తు, 9 లిఫ్టులు, ఒక హెలిప్యాడ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫెసిలిటీ, 50 మంది కూర్చునే మినీ థియేటర్, స్విమ్మింగ్ పూల్స్, వేలాడే తోటలు వగైరా హంగులన్నీ ఉన్నాయి.


ఐదేళ్ల వైభోగమిది

కడప ఎంపీ వైఎస్ జగన్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ ప్రాంతంలో కట్టుకుంటున్న ఇల్లు ఇది. 5,807 చదరపు మీటర్ల స్థలంలో 88,490 చదరపు అడుగుల మేర ఈ ఇంటిని కడుతున్నారు. ఇందులో 14 ఎస్కలేటర్లు, 10 లిఫ్టులు, ఒక మినీ థియేటర్, లైబ్రరీలు, స్క్వాష్ కోర్టు, జిమ్‌లు, 30 బెడ్‌రూమ్‌లు, ఒక్కోటీ సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ సైజ్ ఉండే పలు బాత్‌రూంల... వంటి అనేక హంగులున్నాయి.

హైదరాబాద్, మే 20 : కడప ఎంపీ జగన్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లోటస్‌పాండ్ ప్రాంతంలోని హుడా హైట్స్‌లో ఆరు ప్లాట్లను నాలుగు దొంగ కంపెనీల పేరిట కొనుగోలు చేసి, అందులో భారీ ఇంటిని నిర్మిస్తున్న విషయాన్ని 'ఆంధ్రజ్యోతి' వెల్లడించింది. క్యాప్‌స్టోన్ ఇన్‌ఫ్రా, మార్వెల్ ఇన్‌ఫ్రా, హరీష్ ఇన్‌ఫ్రా, ఉటోపియా ఇన్‌ఫ్రా అనే నాలుగు కంపెనీల పేరిట 2, 3, 4, 6, 7, 8 నంబర్లు గల ప్లాట్లను కొనుగోలు చేసి, ఆ ఆరు ప్లాట్లను ఒకటిగా చేర్చి ఈ ఇంటిని నిర్మిస్తున్నారు.

ఈ ఇంటికి సంబంధించి తవ్వినకొద్దీ కొత్త కొత్త విషయాలు, కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. 2010 జులై 6వ తేదీన ఈ ఇంటి ప్లాన్‌కు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నుంచి అనుమతి పొందారు. ఈ స్థలం మొత్తం విస్తీర్ణం 5,807.19 చదరపు మీటర్లు. (6,945 చదరపు గజాలు) అంటే సుమారు ఎకరంన్నర. బంజారాహిల్స్‌లో ఎకరాన్నర స్థలం కొనడానికి మామూలు ధనవంతులు కూడా సాహసించలేరు.

అయితే, నాలుగు దొంగ కంపెనీలను ముందు పెట్టి, వాటి ద్వారా ఆరు ప్లాట్లను కొనిపించి, వాటన్నింటినీ ఏకం చేసి ఇంత పెద్ద స్థలంగా మార్చారు జగన్! క్యాప్‌స్టోన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్స్ పేరిట దీని ప్లాన్‌కు అనుమతి పొందారు. ఈ ప్లాట్లు పేరుకు నాలుగు కంపెనీలకు చెందినప్పటికీ, అదంతా జగన్ సొంత స్థలమేనని ఆయన సొంత పత్రిక 'సాక్షి'లో బాహాటంగా ప్రకటించుకున్నారు.

ఈ స్థలంలో గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల నిర్మాణానికి జీహెచ్ఎంసీ 2010 జులై 6న అనుమతి ఇచ్చింది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 8,221.09 చదరపు మీటర్లు (88,490 చదరపు అడుగులు). ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం 1,400 చదరపు అడుగుల ఫ్లాట్‌లో నివసిస్తుందని అనుకుంటే అటువంటి 63 ఫ్లాట్లు కలిపితే జగన్ ఇల్లు అవుతుందన్న మాట. అంటే ఓ 250 మంది నివసించడానికి సరిపోయే ఇంట్లో జగన్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారన్న మాట! ఈ భవనం చుట్టూ కరెంటు తీగలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు భారీ ఎత్తున సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. దీనికి సెక్యూరిటీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు కోసమే అయిదు కోట్ల రూపాయలు వెచ్చించినట్టు సమాచారం.

అక్కడే ఆఫీసు... చర్చి!

ఈ భవనంలో మహా తిరకాసు ఉంది. ఇది వివిధ కంపెనీలకు చెందిన స్థలం. కంపెనీలు గెస్ట్‌హౌస్‌లను, కార్యాలయాలను నిర్మించుకోవడం సహజం. కానీ... ఇంటి నిర్మాణం కోసమంటూ అనుమతులు తీసుకోవడం విశేషం. అందులోనే మరో తిరకాసూ ఉంది. ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకున్నప్పటికీ... ఈ భవనాన్ని చూస్తే అందులో పార్టీ కార్యాలయాన్ని కూడా కలిపి నిర్మిస్తున్నట్లు ఎవరికైనా అర్థమవుతుంది. ఒకవైపు ఇల్లు, మరోవైపు కార్యాలయం... ఈ విభజన స్పష్టంగా కనిపిస్తుంటుంది.

ఒకవైపు జగన్ కుటుంబం ఉండేందుకు ఇల్లును నిర్మిస్తుండగా... మరోవైపు చర్చిని, దాని వెనుక కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇల్లు, చర్చి ఒక రోడ్డులో ఉంటే, కార్యాలయం వాటి వెనుకవైపు రోడ్డులో ఉంది. ఈ ఇంటి ప్లాన్‌కు దరఖాస్తు చేసింది 2010 జులై నెలలో! అప్పటికి జగన్ ఇంకా సొంత పార్టీ పెట్టలేదు. పెట్టే ఆలోచన ఉన్నట్లు కూడా చెప్పలేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించే విషయమై కాంగ్రెస్ అధిష్ఠానంతో జగన్ ఘర్షణ పడుతున్న సమయమది. జగన్ సొంత పార్టీ ఏర్పాటు ప్రకటన చేసింది 2011 మార్చి 12న. అంటే పార్టీ ఏర్పాటుకు సుమారు పది నెలల ముందే ఆయన పార్టీ ఆఫీసుతో సహా అన్నింటికీ పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు అర్థమవుతోంది.

అయితే, నివాస ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకుని అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ ఇంట్లో ఆఫీసు కాంప్లెక్స్‌ను నిర్మించినప్పటికీ దానిని పార్టీ కార్యాలయంగా ఉపయోగించబోమని, పార్టీ ఆఫీసు కోసం జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నామని జగన్ సన్నిహితులు చెబుతున్నట్లు సమాచారం. పార్టీ కార్యాలయంగా ఉపయోగించనప్పుడు ఇంట్లో అంత పెద్ద ఆఫీసు భవనాన్ని ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ భవనంపై జగన్ పార్టీ జెండాలను కూడా ఏర్పాటు చేయడం విశేషం.

లోటస్ పాండ్ ప్రాంతంలో రోడ్లు అంత విశాలమైనవి కానందువల్ల అక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చుట్టుపక్కల వారికి ఎంతో ఇబ్బంది కలిగిస్తుందనేది మరో వాస్తవం. హైదరాబాద్‌లోని జగన్ స్థలం ముంబైలోని ముఖేశ్ అంబానీ స్థలం కంటే పెద్దది. అయితే ముఖేశ్ అంబానీ 27 అంతస్తుల్లో 4 లక్షల చదరపు అడుగుల ఇల్లు కట్టగా, జగన్ నాలుగు అంతస్తుల్లో 88 వేల అడుగులతోనే ఆగిపోయారు. జగన్ ఇల్లున్న ప్రాంతంలో గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల (15 మీటర్లు) కన్నా ఎక్కువ కట్టేందుకు అవకాశం లేకపోవడంతోనే 88 వేల అడుగులతోనే ఆగినట్లు అర్థం చేసుకోవచ్చు. లేదంటే జగన్ ఆయనను తలదన్ని ఆంధ్రా ముఖేశ్ అనిపించుకునేవారే!!

ఎన్నో ప్రశ్నలు

* లోటస్‌పాండ్ ప్రాంతంలో 5,900 గజాల స్థలంలో జగన్ సొంత ఇంటిని నిర్మించుకుంటున్నట్లు 2010 సెప్టెంబర్ 10 నాటి సాక్షి పత్రికలో ప్రచురించారు. నిర్మాణంలో ఉన్న ఇంటి ఫొటో కూడా వేశారు. కానీ ఆ ఆస్తిని జగన్ ఎన్నికల అఫిడవిట్‌లో చూపలేదు. ఎందుకని?
* జగన్ తన సొంతమని ప్రకటించుకున్న ఆ స్థలం, ఇల్లు వాస్తవానికి ఆయన పేరిట లేవు. జగన్ మాయా సామ్రాజ్యంలో భాగమైన నాలుగు దొంగ కంపెనీల పేరిట ఉన్నాయి. ఏమిటి ఇందులో మతలబు?
* ఆ కంపెనీల లావాదేవీలన్నీ చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. వాటిలో పెట్టుబడులు, రుణాలు అన్నీ ప్రశ్నార్థకమే!
* అది కేవలం ఇల్లేనని చెబుతూ కార్యాలయం మాదిరిగా ఎందుకు నిర్మిస్తున్నారు? భవిష్యత్తులో దానిని పూర్తిగా లేదా పాక్షికంగా పార్టీ కార్యాలయంగా ఉపయోగించే అవకాశం లేదా?
* సన్నని రోడ్లున్న ఆ ప్రాంతంలో పార్టీ కార్యాలయాన్ని ఎలా నడుపుతారు?
* ఒకవేళ పార్టీ కార్యాలయాన్ని వేరే చోట ఏర్పాటు చేసేట్లయితే ఇంట్లో అంత పెద్ద కార్యాలయాన్ని ఎందుకు నిర్మించారు?