Tuesday, December 7, 2010

జగన్‌ సరికొత్త తెలం‘గానం’ సురేఖాస్త్రం !

jaga

డిసెంబర్‌కు ముందే తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఊహించని విధంగా మలుపు తిరుగుతాయని అంచనా వేస్తున్న ప్రధాన పార్టీలు ఆ మేరకు ఇప్పటినుంచే వ్యూహరచన, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా.. రాజకీయ పార్టీ స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణపై దృష్టి సారించారు. ఒకవేళ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడినప్పటికీ, అక్కడ కూడా తాను బలీయ శక్తిగా ఉండేందుకు జగన్‌ ఇప్పటినుంచే ముందుచూ పుతో వ్యవహరిస్తున్నారు. తాను తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని జగన్‌ స్పష్టం చేయనున్నారు.

ఈ విషయంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారిలోనే పయనిం చనున్నారు. ‘జగన్‌ తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. తెలుగు ప్రజలంతా సమానమే. ఆయన రాష్ట్ర విభజనకు అనుకూ లమే. ఒకవేళ రాష్ట్ర ం విడిపోతే మాది జాతీయ పార్టీ అవుతుంది. రాష్ట్ర విభజన అనేది ఇప్పటి సీఎంతో సహా ఎవరి చేతుల్లోనూ లేదు. అది కేంద్రం రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయం. కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించాలన్నది జగన్‌ అభిమతమ’ని ఆయన సన్నిహిత సహచరుడొకరు వ్యాఖ్యా నించారు.

ఇదిలాఉండగా, తెలంగాణలో కూడా తన పార్టీ శక్తివం తంగా తయారుకావాలంటే తెలంగాణ అనుకూల వైఖరి తీసుకో కతప్పదని జగన్‌ శిబిరం నిర్ణయించింది. అందులో భాగంగా.. జనవరి 1 నుంచి బీసీ మహిళా ఎమ్మెల్యే, జగన్‌కు వీర విధేయురాలయిన కొండా సురేఖ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు డిసెంబర్‌ 15 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమ కమిటీలు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి నుంచి టీఆర్‌ఎస్‌కు మించిన ఊపుతో ఉద్యమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అటు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో మౌనంగా ఉండిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు తెలంగానంపై నోరు మెదపని వైఖరి అవలంబిస్తున్నందున.. తాము ఉద్య మాన్ని చేతులోకి తీసుకోవడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లను తెలంగాణ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టేందు కు జగన్‌ శిబిరం వ్యూహరచన చేస్తోంది. జగన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నిష్ర్కమించేందుకు ప్రధాన కారకులయిన తెలంగాణ సీనియర్లకు సరైన సమయంలో సరైన గుణ పాఠం చెప్పాలని జగన్‌ శిబిరం యోచిస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక బీసీ మహిళా ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ నేతృత్వంలో మొదలుపెట్టడం ద్వారా.. వ్యక్తిగతంగా సీనియర్లను, సంస్థాగతంగా కాంగ్రెస్‌ పార్టీని ఏకకాలంలో దెబ్బకొట్టాలన్న వ్యూహం స్పష్టంగా కనిపి స్తోంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖను ముఖ్యమంత్రిగా ముందే ప్రకటించాలన్నది జగన్‌ శిబిరం వ్యూహమని సమాచారం.

తెలంగాణ వస్తే దళితుడిని సీఎంగా చేస్తానని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. బీసీ, దానికితోడు మహిళయిన సురేఖను సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణలో 65 శాతం బీసీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే వ్యూహంతో ముందుకు వెళుతోంది. టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో కలసిపోయిన సంకేతా లు స్పష్టమయినందున.. ఆ పార్టీని కూడా దెబ్బతీసే రెండంచెల వ్యూహంతో జగన్‌ శిబిరం ముందుకు వెళు తోంది. టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకూ కాంగ్రెస్‌ను విమర్శించ కుండా.. కేవలం తన పార్టీని బలోపేతం చేసుకునేందుకే తెలంగాణ ఉద్యమాన్ని వినియోగించుకుంటోందని గ్రహించిన జగన్‌ బృందం, తెలంగాణపై టీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధి కన్నా, తమకే ఎక్కువ అంకితభావం ఉందని చాటేందుకు తానే సొంతంగా ఉద్యమాలు నిర్మించనుంది.

మరోవైపు.. టీఆర్‌ఎస్‌ కూడా డిసెంబర్‌ 31 తర్వాత తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునేందుకు శ్రీ కృష్ణ కమిటీ నివేదికను ఆసరా చేసుకుని ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని, కార్యాచరణకు శ్రీకారం చుట్టనుంది. టీడీపీ, జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌, బిజేపీ సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సంస్థాగతంగా తాను పటిష్ఠంగా లేకపోతే రాబోయే సమస్యలను ఎదుర్కోవడం కష్టమన్న వ్యూహంతో టీఆర్‌ఎస్‌ డిసెంబర్‌ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో తానే ముందు వరసలో ఉండేలా కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటోంది.

మరోవైపు.. తెలంగాణ సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా ఇప్పటినుంచే తెలంగాణ సమస్యపై గళం విప్పకపోతే డిసెంబర్‌ తర్వాత తామెక్కడ వెనుకబడిపోతామోనన్న ఆందోళనతో ఇప్పటినుంచే తెరపైకొస్తున్నారు. ఎంపీ మధుయాష్కీ, వివేక్‌, మందా జగన్నాధం, సీనియర్‌ ఎమ్మెల్యే ఆర్‌, దామోదర్‌రెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, కెఆర్‌ ఆమోస్‌, యాదవరెడ్డి, కమలాకర్‌రావు వంటి నేతలు తెలంగానాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ మాత్రం, కేవలం టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే లక్ష్యంతోనే అడుగులు వేస్తోంది.

కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తనపై ఉందని కేసీఆర్‌ బాహాటంగా వ్యాఖ్యానించిన తర్వాత.. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు, ప్రధానంగా విద్యార్థి జేఏసీ, ఉద్యోగ సంఘాలు దూరమయిన విషయాన్ని గ్రహించిన టీడీపీ, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తన పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉంది. దేవేందర్‌ గౌడ్‌, నాగం, కడియం, మోత్కుపల్లి వంటి నేతలు తెలంగాణ వాదాన్ని మునుపటి కన్నా ఉధృతంగా వినిపిస్తు తమ పార్టీ ఎక్కడా వెనుకబడి పోకుండా జాగ్రత్త పడుతున్నారు.

No comments: