Friday, May 4, 2012

కాపు కాస్తున్నాయ్‌!

kapu 
రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలపై అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్నేశాయి. సీమాం ధ్రలో ప్రధాన సామాజిక వర్గమైన కాపుల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజికవర్గ దన్ను కోసం మూడు పార్టీలూ పరితపిస్తు న్నాయి.  

కాంగ్రెస్‌ పార్టీకి అనాదిగా సంప్రదాయ ఓటు బ్యాంకుగా కొన సాగుతోన్న రెడ్డి సామాజికవర్గం జగన్‌ వైపు వెళుతోందన్న భావనతో ఉన్న కాంగ్రెస్‌ నాయకత్వం వారికి ప్రత్యామ్నాయంగా అంతకంటే మూడింతల సంఖ్యాబలం ఉన్న కాపు, బలిజలకు చేరువయేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చి కాపు-బలిజను దువ్వే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఆ తర్వాత బలిజ వర్గానికి చెందిన సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి కూడా ఇచ్చి రాయలసీమలో బలిజలకు చేరువయింది. తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధి కంగా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నిర్ణయాత్మకశక్తిగా ఉన్న కాపులకు గాలం వేసేందుకు కాంగ్రెస్‌ శతవిధాలా పావులు కదుపుతోంది. రాయలసీమలో కడప, చిత్తూరులో నిర్ణయాత్మకశక్తిగా ఉన్న బలిజలకు చేరువయేందుకు ఆయా కుల నేతలను ప్రోత్సహిస్తోంది. నెల్లూరులో కూడా బలిజల హవా ఎక్కువే. తాజా ఉప ఎన్నికల్లో నర్సాపురం, రామచంద్రాపురం కాపులకు, తిరుపతి బీసీ బలిజలకు ఇచ్చిన కాంగ్రెస్‌ నాయకత్వం ఆ ప్రయోజనాన్ని మిగిలిన నియోజకవర్గాల్లో పొందాలని భావిస్తోంది. ఇక చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం వల్ల కాపులు గంపగుత్తగా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తోంది.

అందుకే కాపు, బలిజ సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో చిరంజీవిని ప్రచారంలోకి దింపాలని నిర్ణయించింది. కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న కృష్ణా జిల్లా, ప్రధానంగా విజయవాడ నగరంలో దివంగత కాపు నేత వంగవీటి రంగా తనయడు వంగవీటి రాధా ఇటీవల వైకాపా తీర్ధం తీసుకోవడంతో కలవరపడిన కాంగ్రెస్‌.. ఆయనతో పాటు కాపులు చేజారకుండా ఉండేందుకు ఆ వర్గానికి చెందిన నేతలను రంగంలోకి దించింది. అందులో భాగంగా యాదవ వర్గానికి చెందిన మంత్రి పార్ధసారథి ఇటీవల కాపు నేతలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కాపులు కాంగ్రెస్‌లోనే ఉంటారని, రాధా పార్టీ మారినప్పటికీ ఎన్నాళ్ల నుంచో రంగాతో ఉన్న కాపులు మాత్రం జగన్‌ పార్టీలో చేరరని పార్ధసారథి సమక్షంలోనే కాపు నేతలు భరోసా ఇచ్చారు. కాపులంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.

చిరంజీవికి పార్టీలో అధిక ప్రాధాన్యం లభిస్తోందని గుర్తు చేశారు. కోస్తాలో కాపులు జగన్‌ వైపు వెళ్లకుండా నిరోధించడంతో పాటు, తన వైపు మళ్లించుకునేందుకు కాంగ్రెస్‌ తన ముందున్న అన్ని ప్రత్యామ్నాయాలనూ అన్వేషిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా కాపు-బలిజ వర్గంపై కన్నేసింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు తనతో కొనసాగిన కాపు-బలిజ సామాజికవర్గాన్ని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయినప్పటికీ ఇంకా కాంగ్రెస్‌లో చేరని ఆ సామాజికవర్గాన్ని దరిచేర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా, రాయలసీమలో రాజంపేట, రాయచోటి, తిరుపతిలో బలిజ తూర్పు గోదావరిలో రామచంద్రాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం కాపులకు, అనంతపురంలో అనంతపురం అర్బన్‌లో బలిజకు అవకాశం ఇచ్చారు. ఆ మేరకు కాపు-బలిజ సంఘ నేతలు బాబును అనంతపురంలో కలసి తమ వర్గానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

తమ వర్గానికి చెందిన అభ్యర్ధులను గెలిపించుకోవడంతో పాటు, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. సీమలో మొదటి నుంచీ టీడీపీకి బలిజలు సంప్రదాయ ఓటు బ్యాంకుగానే ఉన్నారు. కోస్తాలో కాపులు పూర్తి స్దాయిలో లేనప్పటికీ కాంగ్రెస్‌-టీడీపీకి చెరిసగం మద్దతునిచ్చేవారు. చిరు పార్టీ పెట్టిన తర్వాత ఆ సమీకరణలో మార్పు వచ్చిన నేపథ్యంలో, తిరిగి ఆ సామాజికవర్గాల ఓటు బ్యాంకు కోసం టీడీపీ వ్యూహరచన చేయడంతో పాటు, దానిని కార్యాచరణలో పెట్టింది. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా కాపులను దువ్వే పనిలో ఉంది. విజయవాడలో వంగవీటి రాధా చేరికతో ఆ ప్రాంతంలో కాపులకు చేరువ కావాలని యోచిస్తోంది.

తూర్పు గోదావరిలో ఇప్పటికే జ్యోతుల నెహ్రు వంటి కాపు నేతలు పార్టీలో ఉన్నారు. జగన్‌ ఓదార్పు యాత్ర సందర్భంగా తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులు చాలామంది జగన్‌ వైపు మొగ్గు చూపారు. ముద్రగడ పద్మనాభం వంటి అగ్రనేత కూడా జగన్‌తో కలసి నడిచారు. అయితే జగన్‌ ఒంటెత్తు పోకడలు, వన్‌మ్యాన్‌షో నచ్చని ముద్రగడ వైకాపా నుంచి పక్కకు తప్పుకున్నారు. చిరంజీవి, చంద్రబాబునాయుడు ఆ రెండు జిల్లాల్లో కాపులపై దృష్టి సారిస్తుండటంతో జగన్‌ వైపు వచ్చేవారు తక్కువయిపోతున్నారు. కానీ, కోస్తాలో కాపులను ప్రోత్సహించడం ద్వారా అధికారంలోకి సులభంగా రావచ్చని జగన్‌ అంచనా వేస్తున్నారు.
- సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌

No comments: